జయకు నేనంటే ప్రత్యేక అభిమానం: ఇంటికి వచ్చారని బాబు జ్ఞాపకాలు
ముఖ్యమంత్రి జయలలిత మరణం తమను ఎంతో బాధకు గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి జయలలిత మరణం తమను ఎంతో బాధకు గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. జయలలిత ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మంగళవారం 2నిమిషాలపాటు మౌనం పాటించారు. తమిళ ప్రజలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఉంటారని అన్నారు.
తెలుగు ప్రజలతో కూడా జయలలితకు ప్రత్యేక అనుబంధముందని చంద్రబాబు చెప్పారు. తానంటే ఆమెకు ప్రత్యేక అభిమానమని, ఎప్పుడు ఆమెను కలిసినా అప్యాయంగా పలకరించేవారని తెలిపారు. తనపై తీవ్రవాదులు దాడి చేసిన సమయంలోనూ అన్నివిధాల సహాయం చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు.

తాను ఆమెతో ఎప్పుడు భేటీ అయినా మంచి చర్చలు జరిగేవని తెలిపారు. దేవేగౌడ, ములాయం, జయలతో కలిసి యూఎన్పీఏ ఏర్పాటు చేశామని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ వచ్చిన సమయంలో తమ ఇంటికి కూడా వచ్చారని చంద్రబాబు తెలిపారు.
తెలుగు గంగా నీళ్లు, తదితర అంశాలపై మాట్లాడారని, ఈ క్రమంలో సమస్యలను పరిష్కారం చేశానని చంద్రబాబు చెప్పారు.
పోరాటాల్లో, మానవత్వంలో ఆమె ఎప్పుడూ ముందున్నారని చంద్రబాబ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. పేదలు, మహిళల పట్ల ఎనలేని ఆదరాభిమానాలు చూపారని చెప్పారు. దేశం మంచి నాయకురాలిని కోల్పోయిందని అన్నారు. తమిళ ప్రజలకు తీరని లోటని అన్నారు.
ఏపీలో మంగళవారం సంతాప దినంగా ప్రకటించామని తెలిపారు. కార్యాలయాల్లో మౌనం పాటించాలని ఆదేశించామని చెప్పారు. తాను మంగళవారం మధ్యాహ్నం జయలలిత పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఆమెకు కడపటి వీడ్కోలు పలకనున్నట్లు తెలిపారు. తమిళ ప్రజలు, పార్టీ కార్యకర్తలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. జయలలిత ఆశయాలకు అనుగుణంగా అన్నాడీఎంకే పని చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications