ఆ రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి?: ఏపీకి ప్రత్యేకహోదాపై చంద్రబాబు ట్విస్ట్
న్యూఢిల్లీ: ఐదేళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ లోటు తప్పదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏపీ సమస్యలపై ప్రధాని నరేంద్రమోడీని కలిసిన అనంతరం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ 9 వేల కోట్లతో మిగులు బడ్జెట్లో ఉందన్నారు.
ఐదేళ్లు తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ 47 వేల కోట్ల రెవెన్యూ లోటులో ఉంటుందని చెప్పుకొచ్చారు. 14వ ఆర్ధిక సంఘం సిఫారసులన్నీ అమలు చేసినా ఏపీ ఆర్ధికలోటులోటులోనే ఉంటుందన్నారు. విభజనపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్నారు. హేతబద్ధత లేకుండా ఆంధ్రప్రదేశ్ను విభజించారన్నారు.
విభజన మాపై రుద్దారు
ఆంధ్రప్రదేశ్ విభజనను ఏపీ ప్రజలు కోరుకోలేదని మాపై రుద్దారన్నారు. దీంతో ఇద్దరికీ సమన్యాయం చేయాలని కోరామన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని బీజేపీనే పదేళ్లు కోరిందని చెప్పుకొచ్చారు. ఏటా ఐదారు వేల కోట్లు ఖర్చుపెడితేనే పోలవరం పూర్తి అవుతుందని చెప్పారు. రెండేళ్లలో కొన్ని పనులు మాత్రమే జరిగాయని, ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయన్నారు.
ఏపీకి న్యాయం చేస్తామని తిరుపతిలో ప్రధాని మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జాతీయ సంస్ధలకు ఏటా డబ్బులు ఇవ్వకపోతే అవి ఎప్పటికి పూర్తి అవుతాయని ప్రశ్నించారు. రాజధాని ఉంటే అక్కడ ఆర్ధిక వృద్ధి ఉంటుంది. పక్క రాష్ట్రంలో సమానంగా ఎదిగే వరకు ఏపీకి సాయం చేయాలని కోరామన్నారు. రాజధానికి నిధులు ఇవ్వాలని ప్రధాని మోడీకి కోరామన్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తప్ప కోలుకోదు
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తప్ప కోలుకోలేదని ప్రధానికి వివరిచాంచానన్నారు. ఏపీ ఆదాయ వ్యయాల గురించి మోడీకి వివరించాన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ప్రధాని మోడీని కోరామన్నారు. 12 అంశాలతో కూడిన ఏపీ డిమాండ్లపై సావధానంగా ఉన్న ఏపీ డిమాండ్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాననే ప్రజలు నాకు ఓటేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి నిధులు ఇవ్వకుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటీ? అని ప్రశ్నించారు. విభజన సరిగ్గా జరిగితే అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చిందని కేంద్రాన్ని ఆయన నిలదీశారు.
ముఖ్యమంత్రిగా ఎవరికీ లేని ఇబ్బంది నాకే ఎందుకు కలిగిస్తున్నారు
దేశంలో ముఖ్యమంత్రిగా ఎవరికీ లేని ఇబ్బంది నాకే ఎందుకు కలిగిస్తున్నారని ఆయన కాస్తంత ఆవేశంతో మాట్లాడారు. వేరే రాష్ట్రాలకు లేని శిక్ష ఒక్క ఏపీకే ఎందుకని ప్రశ్నించారు. మరోవైపు ప్రత్యేకహోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశామన్నారు.
ఒక మనిషిని చంపేసి క్షమాపణలు అడిగితే తప్పు మాఫీ అయిపోతుందా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి ఏమిస్తున్నారో చెప్పలేదు, విభజన తరువాత రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందో వివరించలేదని అన్నారు. ఒక ముఖ్యమంత్రి పదేపదే కేంద్రాన్ని అడుక్కోవాలా? నాకేంటీ పరిస్థితి? అని ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రిగా ఉన్న తాను పదేపదే ఢిల్లీ రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘట్టాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ ఏకపక్షంగా విభజన చేసింది
పక్క రాష్ట్రాలతో ఎదిగేలా ఏపీకి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. రాష్ట్ర విభజనను ఏపీ ప్రజలు కోరుకోలేదని కానీ కాంగ్రెస్ ఏకపక్షంగా విభజన చేసిందని చెప్పుకొచ్చారు. అందుకే 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతి పెట్టారని చెప్పారు. రాష్ట్ర విభజన చేసి తప్పు చేసిన కాంగ్రెస్కు పార్లమెంట్లో ఆ తప్పుకు సహకరించిన అన్ని పార్టీలకు బాధ్యత ఉందన్నారు.
ఎవరిష్టం వచ్చినట్టు వారు ప్రాజెక్టులు కట్టుకుంటే పాలసీలు ఎందుకు
విభజనలో అన్ని పార్టీల తెలంగాణలో ఏ ప్రాజెక్టు కూడా అనుమతులు లేకుండా కట్టడానికి లేదని ఆయన తేల్చిచెప్పారు. గతంలోనే తాము చెప్పామని ఆయన తెలిపారు. ఎవరిష్టం వచ్చినట్టు వారు ప్రాజెక్టులు కట్టుకుంటే పాలసీలు ఎందుకని ఆయన నిలదీశారు.












Click it and Unblock the Notifications