చంద్రబాబు సంచలన నిర్ణయం.. కీలక నేత సస్పెన్షన్, మొదలైన నిరసనల సెగ
పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణ చంద్రరావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలుగుదేశంపార్టీ నిర్ణయం తీసుకుంది.
అమరావతి: పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణ చంద్రరావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలుగుదేశంపార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీచేశారు.
మున్సిపల్ చైర్మన్గా కోత పూర్ణచంద్రరావు బాధ్యత గల పదవిని నిర్వహిస్తూ అడుగడుగునా పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగేలా వ్యవహరించినందున సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేతో వివాదాలే కారణమా?
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో పలాస మున్సి పాలిటీకి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ 2014 మున్సిపల్ ఎన్నికల్లో 25 స్థానాలకుగాను 18 వార్డులను టీడీపీ గెలుచుకుంది. దీంతో పార్టీ అధిష్ఠానం కోత పూర్ణచంద్రరావును చైర్మన్గా ఎంపిక చేసింది. మొదట్లో స్థానిక ఎమ్మెల్యే గౌతు శివాజీతో సఖ్యతగా ఉంటూ వచ్చిన కోత పూర్ణచంద్రరావు.. ఆ తర్వాత ఎమ్మెల్యేకు దూరమవుతూ వచ్చారు.
Recommended Video


నాయకుడిగా ఎదగాలనే కాంక్ష...
సొంతంగా నాయకుడిగా ఎదగాలనే కాంక్షతో ఎమ్మెల్యేతో సఖ్యతగా మెలగకుండానే కోత పూర్ణచంద్రరావు కొన్ని నిర్ణయాలు తీసుకునేవారు. దీంతో నియోజక వర్గంలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంతోపాటు టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద గతంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమానికి మున్సిపల్ ఉద్యోగులు వెళ్లకుండా చైర్మన్ హోదాలో కోత అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులు కూడా సస్పెన్షన్ కు గురై వారం రోజుల కిందటే మళ్లీ విధుల్లో చేరారు.

మంత్రి సాక్షిగా మాటల యుద్ధం...
ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పలాస పీహెచ్సీలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన సమయంలో కూడా ఎమ్మెల్యే శివాజీ, చైర్మన్ కోత పూర్ణచంద్రరావు మధ్య మాటల యుద్ధం.. సర్వత్రా చర్చకు దారితీసింది. గతంలో ఈ మున్సిపాల్టీలో కమిషనర్గా పని చేసిన శేషాద్రి అనే అధికారిని ఎమ్మెల్యే శివాజీ.. విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి తీసుకురాగా.. ఇది నచ్చని మున్సిపల్ చైర్మన్ సదరు కమిషనర్ గదికి తాళాలు వేయించారు.

కమిషనర్ తోనూ వివాదం...
ప్రస్తుత కమిషనర్ జగన్మోహన్రావుపై చైర్మన్ కోత పూర్ణచంద్రరావుతో పాటు ఆయన వర్గీయులు భౌతికదాడికి దిగారు. దీంతో సదరు ఉద్యోగి మున్సిపల్ చైర్మన్పై పోలీసు కేసు పెట్టడంతో కోత పరారైపోయారు. తిరిగి బెయిల్పై వచ్చిన మున్సిపల్ చైర్మన్.. రెండు వారాల కిందట తీరప్రాంతమైన బారువ వద్ద టూరిజం రిసార్ట్స్లో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.

ఎంపీపై బహిరంగ విమర్శలు...
ఆ వెంటనే టెక్కలి పోలీసులు సైతం ఛైర్మన్ పూర్ణచంద్రరావును దొంగనోట్ల మార్పిడి వ్యవహారంలో ఈయన పాత్ర ఉందనే ఆరోపణలతో స్టేషన్కు పిలిపించి ప్రశ్నించారు. ఇదంతా ఒకెత్తయితే... గత జన్మభూమిలో పాల్గొన్న చైర్మన్.. మున్సిపాలిటీకి నిధుల మంజూరు విషయంలో ఎమ్మెల్యే శివాజీ, ఎంపీ రామ్మోహన్నాయుడు పట్టించు కోవడం లేదని బహిరంగంగా విమర్శించారు.

‘కోత’ తీరుపై చంద్రబాబు దృష్టి...
ఈ నేపథ్యంలో వరుస వివాదాల్లో మునిగితేలుతున్న కోత పూర్ణచంద్రరావు తీరుపై టీడీపీ అధిష్ఠానం దృష్టిసారించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోత వ్యవహారంపై జిల్లా ఇన్చార్జి మంత్రి పితాని సత్యనారాయణతో ప్రత్యేక నివేదిక రప్పించుకున్నారు. ఛైర్మన్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉండడంతో కోత పూర్ణచంద్రరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్ఠానం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

మొదలైన నిరసన.. రాజీనామాలు...
పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుకు మద్దతుగా ఏడుగురు కౌన్సిలర్లు, ఒక కోఆప్షన్ సభ్యురాలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి ‘కోత' నివాసంలో.. చైర్మన్ సతీమణి, 5వ వార్డు కౌన్సిలర్ కోత అరుణకుమారితోపాటు.. 7, 9, 12, 13, 24, 25 వార్డుల కౌన్సిలర్లు.. మర్రి రోజా, శాసనపురి మోహనరావు, బల్ల రేవతి, సైని కవిత, పాతాళ ముకుందరావు, బడగల సుజాత, కోఆప్షన్ సభ్యురాలు లక్ష్మిప్రదాన్ రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.

ఛైర్మన్ చేసిన తప్పేంటి?
టీడీపీ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తామంతా విస్తృతంగా కృషి చేశామని, కనీసం కౌన్సిలర్ల అభిప్రాయం కూడా అధిష్ఠానం తీసుకోలేదని, ఆయన పార్టీకి చేసిన అన్యాయం ఏమిటో ప్రజలకు చెప్పాలని కోత మద్దతుదారులు ప్రశ్నించారు. ఇన్నాళ్లూ పార్టీకి సేవ చేసేందుకు ఇచ్చే గౌరవం ఇదా? అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీకి తామంతా పూర్తిగా దూరమవ్వాలని నిర్ణయించుకున్నామని... చైర్మన్ కోత పూర్ణచంద్రరావుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని వారు ప్రకటించారు.

ఎమ్మెల్యే ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు: గౌతు శిరీష
పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు విషయమై.. తన తండ్రి, పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ ఎన్నడూ ఫిర్యాదు చేయలేదని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శీరీష వ్యాఖ్యానించారు. తాను కూడా వ్యక్తిగతంగా కోతను ఎన్నడూ టార్గెట్ చేయలేదని అన్నారు. ‘కోత'పై పత్రికల్లో వచ్చిన కథనాలపైనే జిల్లా ఇన్చార్జి మంత్రి పితాని సత్యనారాయణ విచారణ చేపట్టారని పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు తేలడంతో పార్టీ కేంద్ర కమిటీకి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయగా, సస్పెన్షన్ ఉత్తర్వులు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.

ఎర్రన్నాయుడు ఉంటే ఇలా జరిగుండేదా?: కోత పూర్ణచంద్రరావు
దివంగత నేత ఎర్రన్నాయుడు బతికి ఉంటే ఇలా జరిగుండేది కాదని పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కోత పూర్ణచంద్రరావు వ్యాఖ్యానించారు. 1992 నుంచి టీడీపీలో సేవలందిస్తున్నానని, పదేళ్లుగా మున్సిపాలిటీలో టీడీపీ అధికారంలో లేకపోయినా పార్టీ విజయానికి కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అహర్నిశలు శ్రమించినట్లు తెలిపారు. ‘‘ఇంత చేస్తే.. అధిష్ఠానం ఇచ్చిన ప్రతిఫలం ఇదా? పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? కనీసం నా వివరణ కూడా అడగకపోవడం దారుణం. ఇప్పటికైనా పార్టీ నాయకుల నుంచి సమాచారం వస్తుందని ఆశిస్తున్నా. హైకమాండ్ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నా. ముఖ్యమంత్రి దృష్టికి కూడా నా వాదనను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తా..' అని ఆయన వ్యాఖ్యానించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications