కాల్ మనీ: జగన్ వ్యూహానికి చంద్రబాబు కౌంటర్ వ్యూహం
హైదరాబాద్: కాల్ మనీ వ్యవహారంలో తమను చిక్కుల్లో పడేయాలనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ వ్యూహాన్ని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మంత్రులకు ఆయన తగిన సూచనలు కూడా చేశారని అంటున్నారు.
కాల్ మనీ వ్యవహారంలో ఎక్కువ మంది నిందితులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందినవారేనని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడం, కాల్ మనీ కేసుల నిందితులతో ఫొటోలు దిగినంత మాత్రాన రాజకీయ నేతలకు కాల్ మనీ వ్యహారంతో సంబంధాలు ఉన్నట్లు కాదని మరో మంత్రి కామినేని శ్రీనివాస్ అనడం ఆ విషయాన్ని తెలియజేస్తోంది.
విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవులను రద్దు చేసుకుని తిరిగి విధుల్లో చేరారు. కాల్ మనీ వ్యవహారం నుంచి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులను తప్పించడానికే సవాంగ్ను సెలవుపై పంపించారనే ఆరోపణలకు తద్వారా తావు లేకుండా చంద్రబాబు చేసుకున్నారని అంటున్నారు.
సవాంగ్ సెలవుపై వివాదం సమసిపోవడంతో కాల్ మనీ వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వచ్చే విమర్శలను శాసనసభా సమావేశాల్లో తిప్పికొట్టగలమనే ధీమా అధికార తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతోంది. అన్ని పార్టీలవారు కాల్ మనీ వ్యవహారంలో ఉన్నందున ప్రత్యేకంగా అధికార తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడే అవకాశం కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లేకుండా పోయింది.

కాల్ మనీ వ్యవహారంలో ఇరుక్కున్న టిడిపివారి జాబితాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు శాసనసభలో ముందుకు తెస్తే ఆ పార్టీకి చెందినవారి పేర్లను టిడిపి సభ్యులు ముందుకు తెచ్చే అవకాశం ఉంది. పార్టీలకు అతీతంగా కాల్ మనీ వ్యవహారంలోని దోషులను శిక్షిస్తామనే హామీ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడవచ్చు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ముందుగానే ఓ ప్రకటన చేయడానికి అవకాశం ఉందని కూడా అంటున్నారు.
సోమిరెడ్డి వాదన
చంద్రబాబు కాల్ మనీ వ్యవహారంపై సీరియస్గా ఉన్నారని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు దోషులు ఎంతటివారైనా చంద్రబాబు వదిలిపెట్టబోరని ఆయన అన్నారు. పోలీసు కమిషనర్ సవాంగ్ సెలమవును ముఖ్యమంత్రి రద్దు చేయించారని ఆయన చెప్పారు. కాల్ మనీ నేరగాళ్లపై తమ ప్రభుత్వం ఉక్కు పాదం మోపిందని, నిందితుల్లో ఎక్కువ మంది వైయస్సార్ కాంగ్రెసుకు చెందినవారేనని ఆయన అన్నారు. సోమిరెడ్డి మాటలను బట్టి రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికార తెలుగుదేశం పార్టీ వాదన ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.
కస్టడీకి కోరనున్న పోలీసులు
కాగా, విజయవాడలో కాల్మనీ కేసు దర్యాప్తును పోలీసులు తీవ్రం చేశారు. ఇప్పటికే పలువురు నిందితులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న యలమంచిలి శ్రీరామమూర్తి, దూడల రాజేశ్లను అరెస్టు చేశారు. వీరిని మరింత విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బుధవారం పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications