అన్నను ఎదిరించి, పవన్ పరోక్ష మద్దతు: బాబు థ్యాంక్స్
హైదరాబాద్/ఏలూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని ఎదిరించి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా ప్రచారం యాత్రలో అన్నారు.
అన్నను ఎదిరించి పవన్ బిజెపికి మద్దతు పలకడం ద్వారా.. పరోక్షంగా ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు లభించిందని చెప్పారు. అందుకు జనసేన తమ్ముళ్లకు, పవన్ కళ్యాణ్కు తాను ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చంద్రబాబు చెప్పారు.
హీరో నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రచారం ప్రారంభించారు. పార్టీ ప్రజలు నిర్ణయిస్తే ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు సిద్ధమని బాలయ్య చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టిడిపి విజయం కోసం గట్టిగా కృషి చేస్తామని, ఎవరినీ బొట్టు పెట్టి పిలవడం జరగదని బాలయ్య పేర్కొన్నారు.
నామినేషన్ కార్యక్రమం విజయోత్సవ ర్యాలీలా ఉందని బాలయ్య పేర్కొన్నారు. వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు తరలిరావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. టిడిపిలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు. హిందూపురంలో తాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.