టీడీపీ ఎమ్మెల్యేలు ఒకటనుకుంటే.. చంద్రబాబు ఆలోచన మరోవిధంగా..!!
అమరావతి: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమౌతుంది. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేశారు. సభ సమావేశం కావడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయిదు పని దినాల పాటు సమావేశం నిర్వహించాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది. అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటుంది.

మూడు రాజధానుల బిల్లుకు..
ఈ సమావేశాలను అత్యంత కీలకమైనవిగా భావిస్తోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు- ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీనిపై అధికార పార్టీ ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు రానివిధంగా ఈ బిల్లుకు తుదిరూపాన్ని ఇచ్చినట్లు చెబుతున్నారు.

టీడీఎల్పీ భేటీ..
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతోన్నందున- అటు తెలుగుదేశం పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇవ్వాళ తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం భేటీ కాబోతోంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దీనికి నాయకత్వాన్ని వహిస్తారు. ఉప సభాపక్ష నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు, సభ్యులు ఇందులో పాల్గొననున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చిస్తారు.

చంద్రబాబు దూరం..
చాలాకాలం నుంచీ చంద్రబాబు సభకు హాజరు కావట్లేదు. తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాతే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని గత ఏడాది అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిజ్ఞ చేశారు. అసెంబ్లీని బహిష్కరించారు. దానికి కట్టుబడి ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రమే ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు హాజరవుతారని భావించినా అది వాస్తవ రూపం దాల్చలేదు.

మాక్ అసెంబ్లీ..
2024లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నందున.. ఈ రెండేళ్ల కాలం అత్యంత కీలకమైనది కావడం వల్ల చంద్రబాబు సభకు హాజరైతే బాగుంటుందనే అభిప్రాయం టీడీఎల్పీ సభ్యుల్లో వ్యక్తమౌతోంది. కాగా- ఈ దఫా కూడా చంద్రబాబు సభకు గైర్హాజర్ అవుతారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి. ఇదివరకట్లా మాక్ అసెంబ్లీని నిర్వహిస్తారని సమాచారం. గుంటూరు పార్టీ కేంద్రకార్యాలయంలో మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications