‘లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి ’చింతా‘కు బుద్ధి చెప్పాలి’
చిత్తూరు: తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి మాజీ ఎంపి చింతామోహన్కు గుణపాఠం చెప్పాలని ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి చిన్న రాజప్ప ప్రజలకు పిలుపునిచ్చారు. భవానీనగర్లో ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మ, ఆయన రోడ్ షో నిర్వహించారు.
రాయల్నగర్లో రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ.. కేవలం చింతా మోహన్ స్వార్థం కోసమే ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.
ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మానత్వంతో ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్ పోటీగా అభ్యర్థిని నిలబెట్టడం సిగ్గుచేటన్నారు. భర్త ఆశయాల సాధన కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్న సుగుణమ్మను తిరుపతి ప్రజలు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలన్నారు.
మంత్రలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత మాట్లాడుతూ.. చింతా మోహన్ స్వార్థం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న సిఎం చంద్రబాబును విమర్శించడం దారుణమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పినప్పటికీ ఇంకా బుద్ధిరాలేదని అన్నారు.