లోకేష్ మందలింపుపై చినరాజప్ప, 'అసలు చిరంజీవి ఏం చేశారు'
రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ అధినేత జగన్కు చెందిన సాక్షి పత్రిక పైన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప శనివారం నాడు నిప్పులు చెరిగారు. పార్టీ అంతర్గత సమావేశంలో తమ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను మందలించాలన్న వార్తలను ఖండించారు.
రాజధాని నిర్మాణాన్ని, సంక్షేమ పథకాల అమలును అడ్డుకోవాలని వైసిపి ప్రయత్నించి విఫలమైందని ఎద్దేవా చేశారు. దీంతో దిగజారుడు రాజకయాలకు పాల్పడుతూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అంతర్గత సమావేశంలో తనను మందలించారని చెప్పడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో ఒకరిగా తనకు గుర్తింపు ఉందని చెప్పారు. గోబెల్స్ ప్రచారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని, ఆ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు తన పాదయాత్ర సమయంలోనే కాపులను బీసీలలో చేర్చుతామని హామీ ఇచ్చారన్నారు. దానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ముద్రగడ పద్మనాభం అలా చేస్తున్నారన్నారు.
30 ఏళ్లుగా కాపుల కోసం ముద్రగడ, దాసరి నారాయణ రావు, చిరంజీవిలు ఏం చేశారన్నారు. కాపు సామాజిక వర్గ నేతలుగా చెప్పుకుని ప్రచారం పొందుతున్న చిరు, బొత్స, దాసరిలు కాపులకు ఏం చేయలేదన్నారు.
వారు ఏమైనా చేసి ఉంటే అది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. కాపు కమిషన్ పర్యటనలు జరుగుతున్న సమయంలో కొందరు విపక్ష కాపు నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వారిది కేవలం స్వార్థమే అన్నారు. కనీసం కమిటీ నివేదిక ఇచ్చే వరకు కూడా వేచి చూడలేకపోతున్నారన్నారు.












Click it and Unblock the Notifications