చిరు, రఘువీరాకు సోనియా నో క్లాస్: రివర్స్ ఔతుందనే
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ఎపిసిసి చీఫ్ రఘువీరా రెడ్డిలు సోమవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో వైఫల్యానికి చిరు, రఘువీరాలను సోనియా, రాహుల్లు లోతైన నివేదికను ప్రత్యేకంగా అడగలేదని సమాచారం.
పార్టీని పటిష్టపర్చే దిశగా చర్యలు చేపట్టాలని మాత్రం వారికి అధినేత్రి సూచించినట్లుగా తెలుస్తోంది. ఓటమి పైన పూర్తిస్థాయి నివేదిక అడిగితే.. అది తమకే ఎదురు తిరుగుతుందని భావించినందువల్లే సోనియా ఓటమి పైన లోతుల్లోకి వెళ్లనట్లుగా సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వద్దని, విభజన జరిగితే సీమాంధ్రలో పూర్తిగా నష్టపోతామని కాంగ్రెసు పార్టీ నాయకులు నెత్తీనోరు బాదుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ సోనియా విభజనకు మొగ్గు చూపారు. విభజన జరిగితే కాంగ్రెసు గెలవదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు నాయకులు మొదటి నుండి చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో చిరు, రఘువీరాలు సోమవారం కలిసినప్పుడు ఓటమి పైన లోతుల్లోకి వెళ్లనట్లుగా సమాచారం. పార్టీని బలోపేతం చేసే అంశంపై దృష్టి సారించాలని హితవు చెప్పినట్లుగా సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంపై సోనియా కొంత అసంతృప్తికి గురైనట్లుగా సమాచారం.