వేట కొడవళ్లతో దాడులు: వైఎస్ఆర్సీపీ కార్యకర్త హతం
అనంతపురం: జిల్లాలో అత్యంత సమస్యాత్మక కేంద్రంగా గుర్తింపు ఉన్న తాడిపత్రి నియోజకవర్గంలో ఘర్షణలు పతాక స్థాయికి చేరుకున్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య చోటు చేసుకున్న పరస్పర దాడులకు పాల్పడ్డారు. వేట కొడవళ్లతో దాడులకు దిగారు. ఈ ఘర్షణల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ కార్యకర్త హతమయ్యారు. నియోజకవర్గం పరిధిలోని వీరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరాపురం మండలంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్నట్టుగా చెబుతున్నారు.
జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన జేసీ అస్మిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తాడిపత్రి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తుండగా.. అదే కుటుంబానికి చెందిన జేసీ పవన్ కుమార్ రెడ్డి టీడీపీ లోక్ సభ అభ్యర్థిగా అనంతపురం నుంచి బరిలో ఉన్నారు. వీరాపురంలో జేసీ వర్గీయులు పెద్ద ఎత్తున రిగ్గింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం అందింది. దీన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు వీరాపురానికి వెళ్లారు. రిగ్గింగ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా జేసీ వర్గీయులు, వైఎస్ఆర్ సీపీ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. రెండు వర్గాల వారు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు విసురుకున్నారు.

పోలీసులు వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తమపై రాళ్లు విసురుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులపై జేసీ వర్గీయులు వేట కొడవళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో పుల్లారెడ్డి అనే వైఎస్ఆర్సీపీ నాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలారు. వేట కొడవళ్ల దాడిలో పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఓ మహిళా కార్యకర్త కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications