పార్టీ నేతలకు తేల్చి చెప్పిన చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసిన వారికి ఎలా వ్యవహరించాలో సూచించారు. మిగిలిన పదవుల పైన కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. పార్టీ కోసం కష్టాలు ఎదుర్కొన్న వారికి ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పదవుల్ని బాధ్యతగా భావించాలని స్పష్టం చేసారు. ఎక్కడా పదవీ అహంకారం, హడావుడి ఉండకూడదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
నామినేటెడ్ పదవులు పొందిన వారు సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనే మన నినాదాన్ని గుర్తు పెట్టుకుని, ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు సూచించారు. కష్టపడి పనిచేసి, పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేసారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి న్యాయం చేయాలనే ప్రాతిపదికన పదవులకు ఎంపిక చేసామని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగానే పదవులు ఖరారు చేసామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీ కోసం పని చేసిన వారికి పదవులిచ్చామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

పార్టీ కోసం నిలబడిన యువత, మహిళలను ప్రత్యేకంగా గుర్తించామని చెప్పారు. కింది స్థాయిలో పని చేసే కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీ అని చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలోనే ఇతర పదవులు భర్తీ చేస్తామని ప్రకటించారు. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించటం తో పాటుగా సభ్యత్వ నమోదు, లక్ష్యాలను చేరుకున్న వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇంకా చాలామందికి ఆయా కార్పొరేషన్ డైరెక్టర్లతో పాటుగా ఇతర పదవులిస్తామని చెప్పారు. రెండేళ్ల పదవీ కాలాన్ని సమర్థంగా ఉపయోగించుకుని ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు నిర్దేశించారు.












Click it and Unblock the Notifications