ఏపీలో కీలకమైన ఆ నేషనల్ హైవేల విస్తరణ కోసం కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో రహదారుల విస్తరణ పైన ఎక్కువ దృష్టి సారించారు సీఎం చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ పైన దృష్టి సారించిన చంద్రబాబు ఏపీ పురోభివృద్ధికి జాతీయ రహదారులు కీలకంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి జాతీయ రహదారుల విస్తరణ కోసం సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
నేషనల్ హైవే 65 ఆరు లేన్ల విస్తరణ
తెలుగు రాష్ట్రాలకు కీలకంగా భావించే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 ఎంతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఉపయోగపడుతుందో తెలిసిందే. ప్రస్తుతం నేషనల్ హైవే 65 ను ఆరు లేన్లుగా విస్తరించబోతున్నారు. అయితే ఈ హైవేను విజయవాడ సమీపంలోని గొల్లపూడి వరకు విస్తరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

కేంద్రానికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రం ఈ విస్తరణను కంచికచర్ల వరకు మాత్రమే పరిమితం చేయాలని భావిస్తుంటే, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గొల్లపూడి వరకు ఆరు వరుసలుగా ఈ నేషనల్ హైవేని విస్తరించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. అయితే గతంలో ఉన్న ప్రతిపాదన ప్రకారమే గొల్లపూడి వరకు విస్తరించాలని ఆయన కోరుతున్నారు.
విజయవాడ మచిలీపట్నం హైవే విషయంలోనూ మరో లేఖ
ఈ హైవే విజయవాడ హైదరాబాద్ మధ్య రోడ్డు ప్రయాణానికి చాలా ముఖ్యమైన హైవే అని దీనిని గొల్లపూడి వరకు విస్తరిస్తేనే ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు. ఇక ఇదే క్రమంలో విజయవాడ మచిలీపట్నం హైవేను కానూరు నుంచి ఆరు వరుసలుగా విస్తరించాలని కోరుతూ నితిన్ గడ్కరీకి మరో లేఖ రాశారు చంద్రబాబు. విజయవాడ మచిలీపట్నం హైవే విషయంలో నగరంలో బెంజ్ సర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు 65 కిలోమీటర్లు ఉంటుంది.
కానూరు నుండి ఆరు లేన్ల విస్తరణ చెయ్యాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదన
ముందు కానూరు నుంచి మచిలీపట్నం వరకు 61కిలోమీటర్ల రోడ్డును విస్తరించాలని ప్రతిపాదించారు. అయితే బెంజ్ సర్కిల్ నుంచి కానూరు వరకు చాలా భవనాలు ఉండడంతో అక్కడ సేకరించిన భూమి వెడల్పు 30మీటర్లు మాత్రమే ఉండడంతో ఆరు వరుసలుగా రోడ్డును వెడల్పు చేయడం సాధ్యం కాదని తేల్చారు. అయితే కానూరు నుంచి రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరాన్ని సూచిస్తూ, ప్రత్యామ్నాయాన్ని తెలియజేస్తూ ఈ విషయంలో కూడా సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు.
విజయవాడ ట్రాఫిక్ నియంత్రణకు కానూరు నుండి విస్తరిస్తేనే బెనిఫిట్
కానూరు నుంచి ఈ రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించాలని ఆయన కోరారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఇక్కడి నుంచి రోడ్డును విస్తరిస్తేనే ఫలితం ఉంటుందని ఆయన నితిన్ గడ్కరీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. నెప్పల్లి దగ్గర ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు నుండి కాకుండా కానూరు నుండి ఆరు లైన్లుగా విస్తరించాల్సిన అవసరాన్ని ఆ లేఖ ద్వారా చంద్రబాబు కేంద్రానికి పంపారు.












Click it and Unblock the Notifications