చదువురాదు, తెలియదు: ఎర్రబెల్లికి సిఎం రమేష్ కౌంటర్
రాజ్యసభకు గెలవాలంటే వార్డు మెంబర్గా గెలవాల్సిన అవసరం లేదని, ఆ చిన్న విషయం కూడా ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరమే లేదన్నారు. ఆయనకు ఏమీ తెలియదని, అలాంటప్పుడు ఆయన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
తాము సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరిగే వరకు విభజనను అడ్డుకుంటూనే ప్రయత్నాలు చేస్తామన్నారు. తాము తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తర్వాత కూడా టిటిడిపి నేతలు ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయలేకపోయారన్నారు. ఎర్రబెల్లి తీరు ఆడలేక మద్దెల ఓడు ఉన్నట్లుగా ఉందని విరుచుకుపడ్డారు.
కాగా, ఎర్రబెల్లి సిఎం రమేష్ పైన నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. సిఎం రమేష్ లాంటి దళారులు, వ్యాపారవేత్తలు, మోసగాళ్లకు చంద్రబాబు రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చారని ఆగ్రహించారు. రమేష్ లాంటి వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వడం నష్టం చేస్తుందన్నారు. కనీసం వార్డు మెంబర్గా గెలవలేని రమేష్కు పార్టీ ఎంపి పదవి ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఆయన అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు.
ఆయన ఓ బ్రోకర్, మోసగాడు అని ధ్వజమెత్తారు. రమేష్ పైన అధినేత వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సిఎం రమేష్ వల్ల పార్టీ భ్రష్టు పడుతోందని విమర్శించారు. పార్టీలో రమేష్ లాంటి వారు ఉండాలో తాము ఉండాలో చంద్రబాబు తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. డబ్బు ఉందనే అహంకారంతోనే రమేష్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు.