ఎన్టీఆర్ బిడ్డగా...: పురంధేశ్వరిపై ఫైర్, ఏకిపారేసిన జైరాం
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీలో చేరడాన్ని కాంగ్రెసు పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు అధిష్టానం కూడా జీర్ణించుకోలేకపోతోంది. పదేళ్లుగా పార్టీలో ఉండి, పదవులు అనుభవించిన పురంధేశ్వరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని చెబుతున్నారని, దానికి బిజెపి కూడా సహకరించింది కదా అని అంటున్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా పలువురు అధిష్టానం పెద్దలు పురంధేశ్వరి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారట. సోనియాకు పురంధేశ్వరితో మంచి సంబంధాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. అలాంటి పురంధేశ్వరి పార్టీని వీడటాన్ని ఢిల్లీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారట. కేంద్రమంత్రి జైరామ్ రమేష్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరగడమే అందుకు నిదర్శనమంటున్నారు.

పురంధేశ్వరి బిజెపిలో చేరడాన్ని జైరామ్ తీవ్రంగా తప్పు పట్టారు. ఆమెపై నిప్పులు కురిపించారు. పురంధేశ్వరి కృతఘ్నురాలని, స్వార్థపరురాలని, కాంగ్రెసు పార్టీకి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఆమెకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెసు పార్టీయే అన్నారు. పురంధేశ్వరి నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందని వ్యాఖ్యానించారు.
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయడం తప్ప సీమాంధ్రులు అడిగిన అన్ని తాము ఇచ్చామని చెబుతున్నారు. దగ్గుబాటి వారికి కుటుంబ సంక్షేమమే తప్ప మరేమీ పట్టదని మండిపడ్డారు. బిజెపిలో చేరడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. రామాయపట్నంలో దగ్గుబాటి కుటుంబం వేయికి పైగా ఎకరాలు కొనుగోలు చేశారన్న ప్రచారం ఉందని, బహుశా అందుకే అక్కడ ఓడ రేవును ఏర్పాటు చేయాలని కోరారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
పురంధేశ్వరికి కాంగ్రెసు పార్టీ ఏం చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. పార్టీ సీనియర్లను పక్కన పెట్టి తాము ఆమెకు మంత్రి పదవులు ఇచ్చామన్నారు. ఇప్పుడు కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం ద్రోహపూరితమంటున్నారు. తాను పలుమార్లు ఫోన్ చేసినా, ఈమెయిల్స్ పంపినా ఆమె స్పందించలేదన్నారు. పార్టీకి అండగా నిలుస్తారనుకుంటే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. కేంద్రం పైన అపవాదులు వేయవద్దని హితవు పలికారు.
విశాఖ సీటు కోసం సుబ్బిరామి రెడ్డి, పురంధేశ్వరిలు పోటీ పడితే తాము టిఎస్సార్ను రాజ్యసభకు పంపించామన్నారు. సమైక్యాంధ్ర కోరిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లేదా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరినా బాగుండేదని కానీ, బిజెపిలో ఎలా చేరుతున్నారో చెప్పాలన్నారు. పురంధేశ్వరి బిజెపిలో చేరడాన్ని మరో నేత రేణుకా చౌదరి కూడా తప్పు పట్టారు. ఎన్టీఆర్ కూతురుగా కాంగ్రెసులో చేరడమే ఒక ప్రశ్నార్థకమైతే... ఇప్పుడు బిజెపిలో చేరడం మరింత అనైతికమన్నారు.












Click it and Unblock the Notifications