హక్కు నాకు తప్ప ఎవరికీ లేదు, కారు ఫెయిలే: బాబు
హైదరాబాద్: హైదరాబాదును నేనే అభివృద్ధి చేశానని, అలాంటప్పుడు తాను ఓటు అడగవద్దా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. మల్కాజిగిరి లోకసభ స్థానం పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల మాట్లాడారు. ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు. ఢిల్లీలో మోడీ.. ఇక్కడ టిడిపి వస్తేనే సుపరిపాలన సాధ్యమన్నారు.
టిడిపి, బిజెపి పొత్తు సునామీలో కారు, చేయి కొట్టుకు పోవడం ఖాయమన్నారు. జాతీయ ప్రయోజనాల కోసమే బిజెపితో చేయి కలిపినట్లు చెప్పారు. హైదరాబాద్ ఇవాళ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందంటే కారణం తానేనని, ఇక్కడ ఉన్న ప్రతి ముఖ్యమైన సంస్థ వెనుక తన కృషి ఉందన్నారు. సింగపూర్ నిర్మాణానికి పాతికేళ్లు పట్టిందని, సింగపూర్ను తలపించే సైబరాబాద్ను పదేళ్లలో నిర్మించి చూపించానన్నారు. హైదరాబాద్లో ఓటడిగే హక్కు తనకే ఉందని, మరే పార్టీకి లేదన్నారు.

నిజాం నవాబులు చారిత్రక ప్రాధాన్యం ఉన్న నిర్మాణాలు చేస్తే తాను ఆర్థిక ప్రాధాన్యం ఉన్న హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, బయోటెక్నాలజీ పార్క్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి తెచ్చానన్నారు. ఇప్పుడు దాన్నంతా కాంగ్రెస్, తెరాస నాశనం చేశాయన్నారు. వసూల్ రాజాలుగా మారిన పార్టీల దెబ్బకు తాను కష్టపడి హైదరాబాద్కు తెచ్చిన కంపెనీలు కూడా పారిపోతున్నాయని విమర్శించారు.
తెరాస వంటి పార్టీలకు ఒక్క ఓటు వేసినా నాశనమేనని, ఆ పార్టీ మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుందని అప్రమత్తం చేశారు. తెరాస బెదిరింపులకు భయపడి ప్రాంతాన్ని వదిలిపెట్టి పోనని, కొండనయినా బద్దలు కొట్టే సత్తా తనకుందని తేల్చి చెప్పారు. తెరాసను గెలిపిస్తే హైదరాబాద్లో ఇళ్లు ఆక్రమించుకోవచ్చునని కొందరు ప్రచారం చేస్తున్నారని, ఇది ఎక్కడైనా సాధ్యమా అన్నారు. ప్రతి తెలుగువాడికి రక్షణగా టిడిపి ఉంటుందన్నారు.
బిసిని ముఖ్యమంత్రిని చేసి చూపిస్తాన్నారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన తర్వాతే కదులుతానని చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో సైకిల్ గాలి వస్తోందని, ఇక తమకు తిరుగులేదన్నారు. రెండు ప్రాంతాల్లోనూ ఒక విజన్తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. డొక్కు కారు, మొండి చెయ్యి చిత్తు చిత్తేనని వ్యాఖ్యానించారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీస్ అధికారులు కూడా దొంగల పార్టీలో చేరి పోటీ చేస్తున్నారని.. మాజీ డిజిపి దినేశ్ రెడ్డి జగన్ పార్టీలో చేరడాన్ని ఉద్దేశించి అన్నారు.
చేవెళ్ల నుంచి బాబు ప్రచారం
ప్రచారంలో భాగంగా రెండో రోజు చంద్రబాబు ఆదివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్సభ పరిధిలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 4 గంటలకు సరూర్నగర్ నుంచి రోడ్షో ద్వారా బయలుదేరి సాయంత్రం 7 గంటలకు చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రి 8.30లకు శేరిలింగంపల్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications