స్టాలిన్ వద్దకు ఏపీ సీఎం, రాహుల్ గాంధీ దూతగా రేపు చంద్రబాబు వద్దకు అశోక్ గెహ్లాట్
అమరావతి/చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డీఎంకే అధినేత స్టాలిన్ను కలవనున్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం చెన్నై బయలుదేరారు. జాతీయస్థాయిలో బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా పలువురు నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్టాలిన్ను కలుస్తున్నారు.
బెంగళూరులో గురువారం జరిగిన మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, చంద్రబాబు భేటీ అయిన విషయం తెలిసిందే. అన్ని పార్టీలను ఒక్కతాటి పైకి తెచ్చి బీజేపీకి గుణపాఠం చెబుతామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రత్యామ్నాయ కూటమికి జేడీఎస్ నేతలు జైకొట్టారు.
బెంగళూరులోని దేవేగౌడ నివాసంలో జరిగిన ఈ భేటీ సుమారు 45 నిమిషాల పాటు సాగింది. ఇటీవల కర్ణాటకలో జరిగిన 5 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సాధించిన విజయంపై చంద్రబాబు ఇద్దరు నేతలను అభినందించారు.
దేశ ఆర్థిక పరిస్థితి గత నాలుగేళ్లలో ఛిన్నాభిన్నమైందని, రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోయిందని, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు కుదేలవుతున్నాయని, ఈ పరిస్థితి మరెంతో కాలం కొనసాగకూడదనే లక్ష్యంతోనే దేశంలోని లౌకిక శక్తులన్నీ ఒక్కటి కావాలని శ్రమిస్తున్నామని వారు చెప్పారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోసే పనిలో నిమగ్నమైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. స్వేచ్ఛగా విచారణ చేపట్టాల్సిన సీబీఐ, దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచాల్సిన ఆర్బీఐలు వేధింపులకు గురవుతున్నాయని, స్వయంగా ఆర్బీఐ గవర్నరే కేంద్రం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు సమస్యలను సృష్టిస్తున్నాయని, ప్రతిపక్షాలను నియంత్రించేందుకే ఈడీ, ఐటీ సంస్థలున్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందని, రఫేల్ ఒప్పందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రధాని మోడీ నోరు మెదపటం లేదన్నారు.
చంద్రబాబు వద్దకు రాహుల్ దూతగా అశోక్ గెహ్లాట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ శనివారం అమరావతిలో భేటీ కానున్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను కలవనున్నారు. బీజేపీయేతర కూటమి కోసం దేశంలోని ప్రాంతీయ పార్టీలతో చంద్రబాబు వరుసగా భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ దూతగా ఆయన సమావేశం కానున్నారు.