భారీ ట్విస్ట్ - చంద్రబాబు, పవన్ ఆశలు గల్లంతు..!!
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. పొత్తుల లెక్కల పై స్పష్టత వస్తోంది. రెండు కూటములు వర్సస్ జగన్ గా ఎన్నికల పోరు మారుతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేనతో బీజేపీ కలవటం లాంఛనంగా మారుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఉన్న ఇండియా కూటమి పార్టీలతో ఏపీలో కూటమిగా పోటీ చేయాలని భావిస్తోంది. మరో రెండు పార్టీలతో పొత్తుకు ఆహ్వానిస్తోంది. దీంతో, జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యానికి గండి పడే అవకాశం కనిపిస్తోంది.
పొత్తుల లెక్కలు: రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పొత్తుల లెక్కలు మారుతున్నాయి. జగన్ సింగిల్ గానే పోటీకి దిగుతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిగా పోటీకి రంగం సిద్దమవుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూటమి కూర్పు మొదలైంది. ఈ నెల 20న మద్దతుగా నిలిచే పార్టీలతో కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసింది.

ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో కలిసొచ్చే పార్టీలతో పొత్తు పైన ప్రాధమిక చర్చలు పూర్తయ్యాయి. ఏపీలో తమ పార్టీ అడ్రస్ గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వైఎస్ షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. సీపీఐ ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో ఈ మేరకు చర్చలు పూర్తి చేసింది.
కూటమిల పోరాటం: ఏపీలో సీపీఎం వైఖరి పైన రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలుస్తోంది. త్వరలో ఏపీలో రాహుల్ ,ప్రియాంక పర్యటనకు రానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించే సభలో రాహుల్ పాల్గొంటున్నారు. అదే విధంగా అమరావతికి మద్దతుగా నిర్వహించే సభలో ప్రియాంక పాల్గొనేలా కార్యాచరణ డిసైడ్ చేసారు.
ఈ నెల 25,26 తేదీల్లో అనంతపురం వేదికగా పొత్తులతో పాటుగా భారీ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. తొలుత సీపీఐ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని భావించింది. అయితే, చంద్రబాబు బీజేపీతో పొత్తు ఖాయం చేసుకోవటంతో తాము కాంగ్రెస్ తో వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. ఇదే సమయంలో జై భారత్ వంటి పార్టీలతోనూ మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.
వ్యతిరేక ఓటు చీలితే: కానీ, జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా జత కడుతున్నామని చెప్పిన చంద్రబాబు - పవన్ ఆశల పైన మాత్రం కాంగ్రెస్ తాజా నిర్ణయాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనే విశ్లేషణలు ఉన్నాయి.2019 లో జగన్ కు ఓటు వేసిన వారిలో ఇప్పుడు తిరిగి వైసీపీకి వేయకూడదని భావిస్తే, చంద్రబాబు- పవన్ తో పాటుగా కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.
వామపక్షాలతో పొత్తు కారణంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి కలిసి వచ్చింది. ఇప్పుడు వామపక్షాలు కాంగ్రెస్ తో కలిస్తే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఓట్లు అటు మళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో, వ్యతిరేక ఓటు చీలితే చంద్రబాబు ఆశలు ఫలించే అవకాశం లేదనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications