వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి గుండెల్లో అలజడి!!
కరోనా భారతీయ సినీ పరిశ్రమను ఎలా దెబ్బతీసిందో కళ్లముందే కనపడుతోంది. ఇప్పుడిప్పుడే ప్రేక్షులు థియేటర్లకు రావడం ప్రారంభించారు. కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలంతా ఓటీటీలకు అలవాటుపడటంతోపాటు కుటుంబానికి రూ.2వేల నుంచి రూ.3వేలు ఖర్చుచేసి థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అనే ఆలోచనకు వచ్చేశారు. దీంతో చాలా థియేటర్లు కల్యాణ మండపాలుగా మారిపోయాయి.
విజృంభిస్తోన్నబీఎఫ్-7
ప్రస్తుతం బీఎఫ్-7 పేరుతో కరోనా కొత్తరకం విజృంభిస్తోన్న వేళ సినీ నిర్మాతల గుండెల్లో గుబులు రేకెత్తుతోంది. దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి కరోనా తర్వాత నిర్మాతలకు ధైర్యాన్ని కల్పించిన సినిమాలు రెండు. అవి క్రాక్, అఖండ.
ఈ సినిమాల సంచలన విజయంతో ఇతర నిర్మాతలంగా ధైర్యం చేసి తమ తమ సినిమాలను విడుదల చేశారు. పరిస్థితులన్నీ సాధారణమవుతున్నాయి అనుకుంటున్న తరుణంలో బీఎఫ్-7 కేసులు నమోదవుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ తోపాటు సంక్రాంతి పండగలకు ప్రజలంతా ఒకచోట గుమికూడే అవకాశం ఉంటుంది. న్యూ ఇయర్ వేడుకలవల్ల సమూహాలు పెరుగుతాయని, దీన్ని నిరోధించగలిగితే వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని కేంద్రం పేర్కొంటోంది.
సంక్రాంతికి విడుదల కాబోతున్న భారీ సినిమాలు
సంక్రాంతికి మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతోపాటు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వారసుడు డబ్బింగ్ సినిమా విడుదల కాబోతోంది. వీటితోపాటు మరో రెండు చిన్న సినిమాలు కూడా విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే థియేటర్లకు సంబంధించి దిల్ రాజుతో నిర్మాతల మండలి విభేదిస్తోంది.
డబ్బింగ్ సినిమా కోసం అన్ని థియేటర్లను తీసుకోవడం కుదరదని, సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యకు ప్రాధాన్యత ఇవ్వాలంటోంది. దీనిపై దిల్ రాజు ఎటువంటి స్పష్టతా ఇవ్వడంలేదు.
నిర్మాతల్లో భయాందోళనలు
మూడు వారాల సమయం ఉన్న తరుణంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో నిర్మాతలతోపాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. మైత్రి నిర్మాతలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యపై భారీగా పెట్టుబడి పెట్టారు. యూవీ క్రియేషన్స్ నుంచి కూడా ఓ చిన్న సినిమా విడుదల కాబోతోంది. వీటికి సంబంధించిన ప్రి రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది.
కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతోపాటు మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నారు. కేసుల సంఖ్య మరింతగా పెరిగితే థియేటర్లను మూసేయమంటారేమోననే సరికొత్త ఆందోళనను పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు చైనాలో మరణాలు నమోదవుతున్నాయి. దీంతో మనదగ్గర కూడా మాస్క్ లు ధరించి బయటకు వస్తున్నారు. కొవిడ్ ప్రభావం లేకపోతే పర్వాలేదుకానీ ఉంటే పరిస్థితి ఏమిటి? అనే సందేహంతో కూడిన ఆందోళన నిర్మాతలను వేధిస్తోంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.!!