విజయవాడలో అంతుబట్టని కరోనా- అంచనాలన్నీ తలకిందులు.. ! రైతుబజార్లూ మూత..
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాజధాని ప్రాంతంలోని విజయవాడ నగరమైతే దాదాపుగా రెడ్ జోన్ పరిధిలోకి వచ్చేసింది. నగరంలో పరిస్ధితి ఇంత దారుణంగా మారుతుందని ఊహించని అధికార యంత్రాంగానికి ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురవుతోంది. అదే నిజమైతే నగరంలో నిరవధిక లాక్ డౌన్ కొనసాగించ తప్పని పరిస్ధితులు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
విజయవాడలో కరోనా...
విజయవాడ నగరంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంచనాలను మించిపోయింది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 75 కేసులు నమోదైతే ఒక్క విజయవాడ నగరంలోనే 60 కేసులు ఉన్నాయంటే ఇక్కడ పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. నగరంలో 90 శాతం రెడ్ జోన్ పరిధిలోనే ఉందని రెండురోజుల క్రితం అధికారులు చేసిన ప్రకటనతో జనం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
అంచనాలు తలకిందులు..
తొలుత ఓ పానీపూరీ వాలా, ఆ తర్వాత మరో టిఫిన్ బండి, ఢిల్లీ మర్కజ్ రిటర్న్స్ ద్వారా కేసుల సంఖ్య పెరుగుతుందని భావించిన విజయవాడ అధికారులకు తాజాగా నమోదవుతున్న కేసుల సంఖ్య నిద్రపోనివ్వడం లేదు. అంచనాలన్నీ తలకిందులు కావడంతో వైరస్ ఎక్కడ నుంచి వ్యాప్తి చెందుతుందో తెలియక తల పట్టుకుంటున్నారు. తాజాగా వస్తున్న కొన్ని కేసుల్లో వారి ప్రయాణ చరిత్ర కూడా చెప్పలేని పరిస్ధితి ఉండటంతో వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైందా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి,
జనం తీరే ప్రధాన కారణం...
లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నా వాటిని నిర్లక్ష్యం చేస్తూ షాపింగ్, ఇతర అవసరాల పేరుతో రోడ్లపైకి వస్తున్న జనమే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని నగర పోలీసులు గుర్తించారు. రెడ్ జోన్లలో సైతం జనం ఇష్టారాజ్యంగా రోడ్లపైకి రావడంపై ఆగ్రహంగా ఉన్న పోలీసులు ఆదివారం నుంచి డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. నిఘాలో డ్రోన్ కెమెరాలకు పట్టుబడితే కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పరిస్ధితి నియంత్రణలో ఉందని తెలుస్తోంది.
పరిస్ధితి చేయిదాటితే మరిన్ని చర్యలు..
ఇప్పటికే విజయవాడ నగరమంతా దాదాపుగా రెడ్ జోన్ పరిధిలోనే ఉంది. కేవలం రామవరప్పాడు ప్రభుత్వాసుపత్రి నుంచి ఏలూరు వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు మాత్రమే సురక్షితంగా ఉన్నాయి. కానీ పరిస్ధితి విషమించి ఇక్కడ కూడా కేసులు విస్తరిస్తే విజయవాడ నగరాన్ని వందశాతం రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశముంది. అప్పుడు ఉదయం షాపింగ్ కూడా గుంటూరు తరహాలో సరి-బేసి విధానానికి చేరుకున్నా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఆదివారం మాంసాహార మార్కెట్లను మూసేసిన అధికారులు, తాజాగా ఇవాళ్టి నుంచి రైతు బజార్లను కూడా మూసేశారు. దీంతో ప్రజలు రోడ్లపైనే షాపింగ్ చేసుకోవాల్సిన పరిస్ధితి.
Recommended Video