భార్యపై రేప్ యత్నం, భర్తపై దాడి: పిఎస్లో చోరీ
అనంతపురం/ కడప/ ఒంగోలు: అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం యగ్నిశెట్టిపల్లిలో కొంతమంది దొంగలు ఓ ఇంట్లో చొరబడి దంపతులపై దాడి చేశారు. భార్యపై అత్యాచార యత్నం చేయబోగా, భర్త అడ్డుకున్నాడు. దీంతో, ఆగ్రహించిన దొంగలు అతడిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యారు. దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
కడప జిల్లా ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారు. స్టేషన్ ఆవరణలో ఉంచిన ఎర్రచందనం దుంగలను ఎత్తుకెళ్లిపోయారు. ఎర్రచందనం దొంగల భరతం పడతామని ఒంటిమిట్ట స్టేషన్ నుంచి టాస్క్ఫోర్స్ అధికారులు హెచ్చరించిన రెండు, మూడు రోజులకే స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
ఈ మండలానికి చెందిన బొడ్డే వెంకటరమణ అనే బడా స్మగ్లర్తో పాటు మరో ఐదారుగురిని కడప పోలీసులు అరెస్టు చేసి రూ.9 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలా స్వాధీనం చేసుకున్న దుంగలనే ఎర్రచందనం స్మగ్లర్లు గురువారం రాత్రి ఎత్తుకెళ్లడం పోలీసులకు సవాల్ విసిరినట్లయింది. స్టేషన్లో 160 దుంగలు ఉండగా.. 18 దుంగలు తీసుకెళ్లారు. వీటి విలువ రూ.కోటి వరకూ ఉంటుందని అంటున్నారు.
కాగా, ప్రకాశం జిల్లా చీరాల వన్టౌన్ పోలీస్స్టేషన్లో కావేరి పోలేరు అనే నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల వల్లనే కావేరి పోలేరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, వెంటనే పోలీసులపై చర్యలు తీసుకోవాలని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.