కాంగ్రెసు ఒంటరి: కెసిఆర్ ఎన్నికల దోస్తులు వీరే
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెసు పార్టీకి చేయి ఇస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇప్పటికే కొత్త మిత్రులను వెతుక్కున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి వచ్చిన పార్టీలను ఆయన ఎన్నికల పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిపిఐ, సిపిఐ ఎంఎల్ న్యూడెమొక్రసీలతో ఆయన పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో న్యూడెమొక్రసీకి తగిన బలం ఉంది. గతంలో ఇల్లెందు శాసనసభా నియోజకవర్గం నుంచి న్యూడెమొక్రసీ అభ్యర్థి శాసనసభకు ఎన్నికయ్యారు. గుమ్మడి నర్సయ్య ఇల్లందు నుంచి విజయం సాధించారు. సిపిఐకి కూడా ఖమ్మం జిల్లాలో బలం ఉంది. సిపిఐ, సిపిఎం ఈ జిల్లాలో బలంగా ఉన్నాయి. గతంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. సమైక్య నినాదం వినిపించిన సిపిఎంతో సిపిఐ కలిసి వెళ్లే అవకాశాలు లేవు.
న్యూడెమొక్రసీ, సిపిఐ కలిస్తే ఖమ్మం జిల్లాలో బలమైన శక్తిగా అవతరించే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి. అదే విధంగా తెలంగాణ జెఎసిలోనే కాకుండా తెలంగాణ ప్రజా సంఘాల్లో న్యూడెమొక్రసీ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాజకీయ జెఎసితో పాటు ఇతర ప్రజా సంఘాలు తమ వైపు ఉంటే తెలంగాణలో విజయం సులభమవుతుందని, అందుకు న్యూడెమొక్రసీతో పొత్తు పెట్టుకోవడ అవసరమని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నల్లగొండ, నిజామాబాద్ వంటి జిల్లాల్లో సిపిఐ బలంగా ఉంది. నల్లగొండ జిల్లాలో సిపిఐతో కలిస్తే సిపిఎంను, తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం సులభమవుతుందని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వామపక్షాల సాయంతో తమ పార్టీ బలంగా లేని ప్రాంతాల్లో పాగా వేయాలని కెసిఆర్ వ్యూహంగా చెబుతున్నారు.
ఈ స్థితిలో తెలంగాణలో కెసిఆర్ కాంగ్రెసును ఒంటరిని చేసినట్లేనని భావిస్తున్నారు. ఒంటరి చేయడం ద్వారా కాంగ్రెసును, సిపిఐ వంటి పార్టీలతో పొత్తు ద్వారా, వలసలను ప్రోత్సహించడం ద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయాలని కెసిఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.