దళిత సిఎంపై టార్గెట్ కెసిఆర్, కాపలాకుక్కలా అని: గద్దర్
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళితుడినే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని పలుమార్లు ఆయన ప్రకటించారని, ఇప్పుడు మాట మార్చారని, ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాదిగ దండోరా సోమవారం డిమాండ్ చేసింది.
ఈ మేరకు వారు సోమవారం బంజారాహిల్స్ ఏసీపీ రమేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కెసిఆర్ దళితుళ్ని అవమానించారని, ఆయన పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులే పేర్కొన్నారు. ఇదే అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.
తెలంగాణ వచ్చినా దొరల పాలన మాత్రం పోలేదని ప్రజా గాయకుడు గద్దర్ వేరుగా అన్నారు. తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీని కెసిఆర్ విస్మరించారంటూ తెలంగాణ ఆల్ ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఛత్రినాక వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో హాజరైన గద్దర్ మాట్లాడుతూ... సమైక్యాంధ్రప్రదేశ్లో అగ్రవ్రణాల చేతిలో ఉన్న అధికారం ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే బడుగులకు దక్కుతుందని భావించారన్నారు. దళితుడిని సిఎం చేసి కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన కెసిఆర్.. స్వార్థం కోసం మాట మార్చి సిఎం పీఠమెక్కారన్నారు. కెసిఆర్ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామన్నారు.
కెసిఆర్ తన మంత్రివర్గంలో ఉన్నత వర్గాలకే పెద్దపీట వేశారని జీవన్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్న కెసిఆర్... మాట తప్పి దళిత వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టారన్నారు. సామాజిక తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన వారిని సమరయోధులుగా గుర్తించాలన్నారు. ఎన్నో నష్టాలకు, కష్టాలకు ఓర్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కెసిఆర్ ముఖ్యమంత్రి హోదాలో కృతజ్ఞతలు తెలపకపోవడం బాధాకరమన్నారు.