విజయవాడలో దళిత హక్కుల దీక్షప్రారంభం:జాతీయ నాయకుల హాజరు
విజయవాడ:ఎస్సి, ఎస్టి అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టపర చాలని కోరుతూ విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌకలో సోమవారం దళిత హక్కుల దీక్ష ప్రారంభమయ్యింది. ఈ దీక్షా కార్యక్రమానికి వివిధ జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఈ దళిత దీక్షా శిబిరాన్ని ను సిపిఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని, ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టానికి రక్షణ కల్పించాలని కోరారు.
రాష్ట్రంలో దళితులపై దాడులు చేసిన ప్రధాన ముద్దాయిలను తక్షణం అరెస్టు చేయాలని, దళితులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సి, ఎస్టి అత్యాచార నిరోధక చట్టంపై కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని వారు తెలిపారు. కుల వివక్ష పోరాట సంఘం జిల్లా నేతలు మాట్లాడుతూ దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రక్షణగా ఉంటుందనుకున్న ఎస్సి, ఎస్టి అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగు తున్నాయన్నారు. మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు ఈ చట్టంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందన్నారు. దీనికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో 11 మంది చనిపోయారని, అయినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టపర చడానికి ఆర్డినెన్స్ ను తెస్తామన్న బిజెపి ప్రభుత్వం ఇప్పుడు మాట మారుస్తుందని విమర్శించారు.