ఎందుకిలా?: ఉన్నత చదవులు, ఆలోచన లేకుండా అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
అమరావతి: విజయవాడలోని రాయనపాడు రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, తల్లి అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావడంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో యువతి రైలు పట్టాల పైనుంచి కల్వర్టు కింద పడిపోయి తీవ్రంగా గాయపడింది.
ఆమెను గమనించిన స్థానికులు నగరంలోని ఆంధ్రా హాస్పిటల్కు తరలించారు. ఈ సంఘటన శుక్రవారం వేకువజామున జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన లారీ యజమాని షేక్ రఫీకి ముగ్గురు కుమార్తెలు.
రఫీ భార్య షోరా సుల్తానా అనారోగ్యానికి గురికావడంతో విజయవాడ సమీపంలోని పోరంకికి సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నాడు. పోరంకిలోని తన బావమరిది ఇంట్లో ఉంటూ రోజూ ఆస్పత్రికెళ్లి భార్యను చూసి వస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆసుపత్రి నుంచి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని రఫీ అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ వార్త తెలిసి హైదరాబాద్ నుంచి ముగ్గురు కుమార్తెలు షాహీన్ సుల్తానా, పర్వీన్ సుల్తానా, రుక్సియా సుల్తానా విజయవాడకు వచ్చారు. తండ్రి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి లేకపోతే తాము బ్రతకలేమని బంధువుల వద్ద బోరున విలపించారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండా ముగ్గురు ఇంట్లో నుంచి బయటకొచ్చేశారు.
దీంతో ఆందోళనతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వారి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోపు శుక్రవారం తెల్లవారుజామున రాయనపాడు వద్ద రైల్వే ట్రాక్పై షాహీన్ సుల్తానా, పర్వీన్ సుల్తానా మృతదేహాలను స్థానికులు కనుగొన్నారు.
తీవ్ర గాయాలతో పడి ఉన్న రుక్సియా సుల్తానాను స్థానికులు ఆంధ్రా ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాగా మృతిచెందిన షాహీన్ సుల్తానా బీటెక్ చదివింది. పర్వీన్ సుల్తానా ఎంసీఏ చదువుతోంది. గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రుక్సియా సుల్తానా బీటెక్ చదివిందని, నెల రోజుల క్రితమే అమెరికాకు చెందిన యువకుడితో వివాహం జరిగిందని బంధువులు చెబుతున్నారు.