విశాఖకు వెళ్లాలా - రైళ్లు.. బస్సులు ఫుల్ : ఇక స్పెషల్ బాదుడే - హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా..!!
సంక్రాంతి ఎఫెక్ట్ అప్పుడే మొదలైంది. ముందుగానే రైళ్లు - బస్సులన్నీ ముందస్తు రిజర్వేషన్ తో నిండిపోయాయి. సంక్రాంతి అంటే పెద్ద పండుగ. గత రెండేళ్లు కరోనా కారణంగా అందరూ ఈ పండుగ వేడుకలకు దూరమయ్యారు. ఈ సారి అయినా సొంత గ్రామాలకు వెళ్లి పండుగ చేసుకుందామంటే..ఇప్పటికే రైళ్లు - బస్సులు ఫుల్ అయిపోయాయి. ఇక, స్పెషల్ రైళ్లు- బస్సుల పేరుతో బాదుడుకు రంగం సిద్దం అవుతోంది. హైదరాబాద్ నుంచి విశాఖ వరకు... ఇటు చిత్తూరు దాకా ఎటు వెళ్లాలనుకున్నా ఇదే పరిస్థితి.

ముందుగానే రైళ్లు - బస్సులు ఫుల్
ప్రతీ ఏటా సంక్రాంతి వస్తే హైదరాబాద్ ఖాళీగా కనిపిస్తుంది. ప్రధానంగా ఏపీ నుంచి హైదరాబాద్ లో స్థిర పడిన వారు ఎక్కువగా ఈ పండుగకు తమ ప్రాంతాలకు వెళ్తారు. దీంతో...ఇప్పటికే జనవరి 7 నుంచి 14 వరకు రైళ్లు, బస్సుల్లో బెర్తులు, సీట్లు ఫుల్ అయిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు - బస్సుల్లో ఖాళీలు లేవు. అదే విధంగా.. విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్లే రైళ్లు, బస్సులకు డిమాండ్ కనిపిస్తోంది. రిజర్వేషన్ చేయించుకుందామంటే చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంటోంది. కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లలో ఇప్పటికే 'రిగ్రెట్' అని వస్తోంది.

సంక్రాంతి రద్దీతో అదనపు సర్వీసులు
విజయవాడ - విశాఖ మధ్య నిత్యం దాదాపుగా 85 రైళ్లు నడుస్తాయి. సెకండ్ సిట్టింగ్తో నడిచే విజయవాడ-విశాఖ (రత్నాచల్), గుంటూరు-విశాఖ (సింహాద్రి), లింగంపల్లి-విశాఖ(జన్మభూమి) రైళ్లలో మాత్రమే ప్రస్తుతానికి కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన అన్ని రైళ్లలో.. అన్ని క్లాసులూ వెయిటింగ్ లిస్టులతోనే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. వీరంతా సంక్రాంతికి తమ స్వస్థలాలకు వెళ్లడానికి ముందస్తుగానే రిజర్వేషన్లు చేయించుకోవడంతో రైళ్లలో సీట్లు, బెర్తులు లభ్యం కావడం లేదు. బస్సుల్లోనూ విజయవాడ-విశాఖపట్నం రూట్ లో నడిచే బస్సులన్నీ ఇప్పటికే ఖాళీలు లేవని చెబుతున్నారు.

స్పెషల్ బాదుడు తప్పేలా లేదు
రెగ్యులర్ సర్వీసులుగా నడిచే 463 బస్సులు ఫుల్ అయిపోయాయి. దీంతో.. ఇప్పుడు స్పెషల్ సర్వీసులకు రిజర్వేషన్లు ఓపెన్ కానున్నాయి. ఇందులో సాధారణ టిక్కెట్ ధర కంటే 50 శాతం అధికంగా వసూలు చేయటం ప్రతీ రద్దీ సందర్భంలోనూ కామన్ జరిగేదే. అయితే, ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే రైళ్లల్లో మాత్రం ఖాళీలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్ రైళ్లల్లో జనవరి 15వ తేదీ వరకు వేకెన్సీ చూపిస్తున్నాయి. కానీ, 15వ తేదీ తరువాత స్పెషల్ రైళ్లు వచ్చేస్తాయి. ఇక, అటు తెలంగాణ-ఇటు ఏపీఎస్ ఆర్టీసీ పండుగ కోసం ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు సిద్దం అవుతున్నాయి. వీటిలో విశాఖపట్నానికి 390, రాజమండ్రికి 360, హైదరాబాద్కు 362, చెన్నైకి 20, బెంగళూరుకు 14, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 120 బస్సులను నడపనున్నారు.












Click it and Unblock the Notifications