అవేం మాటలు: హరీష్పై దేవినేని, మంత్రి పల్లె వాహనంపై వైసిపి దాడి
విజయవాడ: తెలంగాణ మంత్రి హరీష్ రావు పైన ఏపీ మంత్రి దేవినేని ఉమామహశ్వర రావు నిప్పులు చెరిగారు. కృష్ణా నది జలాల బోర్డు ఏపీకి నాలుగు టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం విడుదల చేయాలని ఆదేశించినా తెలంగాణ అధికారులు సంబంధిత ఉత్తర్వులను అమలు చేయడం లేదన్నాపు,
కృష్ణా జలాల విడుదలపై హరీశ్ రావు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నారన్నారు. కృష్ణా నది జలాల బోర్డు ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ వ్యాఖ్యానించటం కూడా తగదన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి తాము అన్యాయం చేశామంటూ కేంద్రమంత్రికి, గవర్నర్కు ఫిర్యాదు చేస్తాననటం సరికాదన్నారు.
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటి మట్టం ఐదు అడుగులకు పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం మానవతా దృక్పథంతో నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు ఆదేశాలు జారీ చేసిందన్నారు.

అయితే, 1.13 టీఎంసీల నీటిని మాత్రమే తెలంగాణ విడుదల చేసిందని, ఈ విషయాన్ని ప్రస్తావించడం తప్పా అన్నారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే దానిపై కృష్ణా బోర్డుకు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. సంబంధిత ప్రాజెక్టుల నిర్మాణంపై ఏపీ రైతులు కూడా సుప్రీం కోర్టుకు వెళ్లారని, దీనిపై జులై 20న తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు.
మంత్రి పల్లె వాహనం దగ్ధం
వైసిపి అధినేత జగన్ రైతు భరోసా యాత్ర ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగుతోంది. యాత్రను అడ్డుకునేందుకు టిడిపి కార్యకర్తలు ఆదివారం అనంతపురం జిల్లా ఒడిసిలో రోడ్డుపై బైఠాయించారు. వారిని వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఇరు వర్గాల మధ్యా ఘర్షణ జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహంతో మంత్రి పల్లె రఘురాథ రెడ్డికి చెందిన వాహనాన్ని వైసిపి వర్గీయులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.












Click it and Unblock the Notifications