డిగ్గీ ఫోన్కు ముద్రగడ నో చెప్పారా?: హర్షకుమార్ అరెస్ట్, బాబు అత్యవసర భేటీ
రాజమహేంద్రవరం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆదివారం నాడు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు ఫోన్ చేశారు. ఆయన నిరాహార దీక్ష, ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీశారు. మరోవైపు, డిగ్గీ ఫోన్ చేస్తే ముద్రగడ మాట్లాడేందుకు నిరాకరించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
దిగ్విజయ్ ఫోన్ చేస్తే ముద్రగడ మాట్లాడలేదా? ఇతరులు మాట్లాడి ఆయన దీక్ష గురించి, ఆరోగ్యం గురించి.. దిగ్విజయ్ గురించి వివరాలు తెలియజేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.
కాపులకు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉభయ గోదావరి జిల్లాలలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఆదివారం రాజమహేంద్రవరంలో మాజీ మంత్రి హర్షకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వస్తుండగా పత్తిపాడు వద్ద అతనిని అదుపులోకి తీసుకున్నారు. సంఘీభావం తెలిపేందుకు వస్తే తనను అరెస్టు చేయడం దారుణమని హర్షకుమార్ ధ్వజమెత్తారు. కాపు ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి, ఒత్తిడి పెంచాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
హామీ నిలబెట్టుకోండి: చింతా మోహన్
కాపులను బీసీల్లో చేర్చుతామని టిడిపి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నేత చింతామోహన్ డిమాండ్ చేశారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా ఆదివారం తిరుపతిలో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పోలీసులు అయనను అదుపులోకి తీసుకున్నారు.
అత్యవసర భేటీ
విశాఖలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సర్క్యూట్ హౌస్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఉపసంఘం, కాపు నాయకులతో చంద్రబాబు చర్చిస్తున్నారు.
ముద్రగడతో దీక్ష విరమింప చేస్తే రాజకీయంగా దెబ్బతింటామని కొందరు కాపు నేతలు చంద్రబాబుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. చర్చలకు వెళ్తే ప్రభుత్వం దిగి వచ్చినట్లు, దీక్ష కొనసాగితే ఉద్యమం తీవ్రమవుతుందని చంద్రబాబు అన్నట్లుగా సమాచారం. ఉపసంఘంలో ప్రత్యామ్నాయం కోసం చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.