బాలింతను జుట్టు పట్టి..: ప్రొఫెసర్ లక్ష్మి పైశాచికానికి నిదర్శనాలివే!
గుంటూరు: ఆమె బాధ్యత గల గురువు స్థానంలో ఉండి విధులు నిర్వహిస్తున్నారు. కానీ, ఆమెలో మాత్రం ఎనలేని రాక్షసత్వం దాగివుంది. ఆ రాక్షసత్వానికి అనేకమంది బలయ్యారు. తాజాగా, ఓ మెడికల్ విద్యార్థిని కూడా ఆమె వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. ఇదంతా గుంటూరు మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా పని చేస్తున్న డాక్టర్ ఏవివి లక్ష్మి గురించి.
కాగా, ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల కారణంగానే గుంటూరు వైద్య కళాశాలలో గైనకాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాల సంధ్యారాణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని విచారణ కమిటీ కూడా తేల్చడం గమనార్హం. ప్రొఫెసర్ లక్షిని వెంటనే విధుల్లో నుంచి తొలగించి, అరెస్ట్ చేయాలని విద్యార్థులు గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.
సంధ్యారాణి ఆత్మహత్య: ప్రొఫెసర్ అరెస్ట్కు డిమాండ్, మెజిస్టేరియల్ విచారణ
ప్రొఫెసర్ లక్ష్మిపై వేధింపులు చిట్టా ఒక్కసారి గమనించినట్లయితే.. ఆమెలోని రాక్షసత్వం గురించి తెలుస్తుంది. లక్ష్మిపై ఆమె బాధితుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. అయితే, తన పలుకుబడిని ఉపయోగించిన లక్ష్మి వాటన్నింటిని నుంచి బయటపడ్డారు. చివరకు ఆమె కారణంగా ఓ యువతి ప్రాణాలు పోగొట్టుకుంటే కానీ, ఆమె పైశాచికత్వం వెలుగులోకి రాలేదు. ఆమె అరాచకాలను ఒక్కసారి పరిశీలించినట్లయితే..
జులై 25న లాలాపేటకు చెందిన మౌనిక అనే బాలింత బిడ్డకు పాలిస్తూ ఉండగా.. ఆమె మూడేళ్ల పెద్ద కుమార్తె వార్డులో తిరుగుతోందనే కారణంతో మౌనికను లక్ష్మి జుట్టుపట్టి ఈడ్చి కింద పడేసి అసభ్య పదజాలంతో దూషించింది. దీనిపై మౌనిక భర్త విజయకుమార్ ఆర్ఎంవో రమేశ్, సూపరింటెండెంట్ రాజునాయుడుకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు సూపరింటెండెంట్ ఆదేశించారు. కానీ అప్పటికే మౌనిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు చూపి చర్యలు తీసుకోకుండా వదిలేశారు.

ఆ తర్వాత 'కుంటిదానివైన నిన్ను నీ భర్త ఎలా పెళ్లి చేసుకున్నాడు. ఉన్నాడా.. వదిలి వెళ్లిపోయాడా' అంటూ గైనకాలజీ ఓపీ విభాగంలో పనిచేసిన వికలాంగురాలైన స్టాఫ్ నర్సును తీవ్ర వేధింపులకు గురిచేసింది. దీంతో లక్ష్మిపై నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పకు ఆమె ఫిర్యాదు చేశారు. అంతా నిలదీయడంతో మరోసారి ఇలా జరగనివ్వనని చెప్పి లక్ష్మి తప్పించుకుంది. కానీ మళ్లీ అదే తరహాలో వేధింపులకు పాల్పడుతూనే ఉందని విచారణ కమిటీకి వంద మంది స్టాఫ్నర్సులు ఫిర్యాదు చేశారు.
మరో 20 మంది పీజీ విద్యార్థులు, సుమారు 40 మంది నాల్గో తరగతి ఉద్యోగులు, జీజీహెచ్ వైద్యాధికారులు సైతం విచారణ కమిటీ ఎదుట లక్ష్మిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సహచర విద్యార్థినుల ముందు ఎంత అసభ్య పదజాలం వాడినా డాక్టర్ సంధ్యారాణి ఓపికతోనే ఉండేదని, చివరకు ఆమె ఓపిక నశించి ఆత్మహత్యకు పాల్పడిందని కమిటీ తేల్చింది.
ప్రొఫెసర్ వేధింపుల వల్లే సంధ్యారాణి మృతి చెందిందని నిర్ధారిస్తూ విచారణ కమిటీ ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా మంత్రి కామినేని శ్రీనివాస్ లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడిందని ప్రకటించారు.
లక్ష్మి అరాచకాలు తెలిసి షాక్ తిన్న విచారణ కమిటీ సభ్యులు
లక్ష్మి వ్యవహారశైలిపై పలువురు వెల్లడించిన విషయాలతో కమిటీ సభ్యులే నివ్వెరపోయినట్లు తెలుస్తోంది. విచారణలోని పలు అంశాలను వైద్య విద్యా శాఖకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఒక అధ్యాపకురాలు, విద్యార్థి మధ్య ఈ తరహా వేధింపులు ఇప్పటివరకూ వినలేదని పేర్కొన్నారు.
సంధ్యారాణి భర్త ఆత్మహత్యాయత్నం: లక్ష్మి విధుల తొలగింపునకు డిమాండ్
తన భార్య చనిపోయినా న్యాయం జరగడం లేదంటూ మనోవేదన చెందిన డా సంధ్యారాణి భర్త డాక్టర్ రవి కూడా ఆత్మహత్యకు యత్నించి మృత్యువుతో పోరాడుతున్నాడు. ఘటన జరిగి 10 రోజులు దాటినా ప్రభుత్వం, పోలీసులు ఇంతవరకు లక్ష్మిని అరెస్టు చేయకపోవడంపై జూనియర్ డాక్టర్లు ఆందోళనను ఉధృతం చేశారు. లక్ష్మిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే లక్ష్మి భర్త విజయసారథిని కూడా ఎంసీఐ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications