బాబు అతిథి, తలదూర్చొద్దు: కేటీఆర్, దిష్టిబొమ్మ దగ్ధం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ వ్యవహారాలలో తలదూర్చడం సరికాదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం అన్నారు. గవర్నర్కు అధికారాలు కట్టబెట్టేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమేనని చెప్పారు. దీనికోసం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామన్నారు.
ముఖ్యమంత్రిగా పని చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అన్ని విషయాలు బాగా తెలుసునని ఆయన అన్నారు. హైదరాబాదు పైన సర్వాధికారాలు తమవేనన్నారు. హైదరాబాదు విషయంలో తమకు ఇబ్బందులు సృష్టిస్తే చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. చంద్రబాబు తమ అతిథి అని, ఆయన హైదరాబాదులోనే నిరభ్యంతరంగా ఉండవచ్చునని వ్యాఖ్యానించారు. గురుకుల్ భూముల్లో చంద్రబాబుకు ఎవరైనా బినామీలు ఉన్నారా? ఆయన ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు.

చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం
అసెంబ్లీ ఎదుట తెలంగాణ న్యాయవాదులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వారు ఆరోపించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.
ఆందోళనకరంగా: గల్లా జయదేవ్
విభజన అనంతరం తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ చర్యలు ఆందోళనకరంగా ఉన్నాయని గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ అన్నారు.
హైదరాబాదులో సీమాంధ్రుల రక్షణ, వారి ఆస్తుల రక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాదు శాంతిభద్రలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్ చేతిలోనే ఉంచాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications