కేసీఆర్పై మండిపడ్డ ఎర్రబెల్లి, ఫిర్యాదు చేస్తామని హరీష్
వరంగల్/హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనలా ఉందని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రభుత్వాన్ని తాము నిలదీస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అయిదు నెలల పాలనలో ఎవరు సంతోషంగా లేరన్నారు. వృద్ధులు, రైతులు, విద్యార్థుల కష్టాలకు కేసీఆర్ పాలనే కారణమన్నారు.
ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎల్లుండి నుండి తెలుగుదేశం పార్టీ తరఫున రూ.50వేల నష్టపరిహారం ఇస్తామన్నారు. కేసీఆర్ ఛత్తీస్ గఢ్కు ఐదు నెలల క్రితమే వెళ్లి ఉంటే ఆత్మహత్యలు జరగకపోయి ఉండేవని ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు.
చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం తమ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కార్యాచరణ, రైతు సమస్యల పైన చర్చించారు. ఢిల్లీ పర్యటన వివరాలను చంద్రబాబుకు వివరించారు.
కృష్ణా బోర్డు నిర్ణయంపై ఫిర్యాదు
శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పాదన విషయంలో కృష్ణా బోర్డు నిర్ణయం పైన తాము కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు. తాము సోమవారం ఉమాభారతిని కలుస్తామన్నారు. బోర్డు పైన ఫఇర్యాదు చేస్తామన్నారు. చెరువుల పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు.
శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఎవ్వరూ ఆపలేరు: కేసీఆర్
శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఎవ్వరూ ఆపలేరని కేసీఆర్ హైదరాబాదులో అన్నారు. నిబంధనల మేరకే శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని చేపడుతున్నామన్నారు. తెలంగాణలో పంటలను ఎండగట్టేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. చంద్రబాబు పప్పులు ఉడకనివ్వమన్నారు.
హైదరాబాద్లో నీటి కొరతకు కాంగ్రెస్, టీడీపీలే కారణమని, ఆ రెండు పార్టీలు గతంలో వ్యవహరించిన తీరు కారణంగానే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సమస్య నెలకొందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఆ రెండు పార్టీలు చేసిందేమీ లేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు మాయలో పడిపోయిందన్నారు. తెలంగాణకు చంద్రబాబు కరెంట్ ఇవ్వడం లేదన్నారు. కృష్ణా జలాలపై ఆధిపత్యం చెలాయించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.