నష్టపోయిన టికే ప్యాకేజీ: ఈటెల, సీట్ల పెంపుపై టిఎన్జీవో
హైదరాబాద్: విభజన అనంతరం సమైక్య రాష్ట్రంలో నష్టపోయిన తెలంగాణకే ప్యాకేజీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ గురువారం డిమాండ్ చేశారు. అన్ని సమస్యలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే పరిష్కారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యమకారులు భాగస్వామ్యం కావాలని సూచించారు. తెలంగాణలో రాజకీయ నైపుణ్యం లేదని అనుకోవద్దని సీమాంధ్ర నేతలను ఉద్దేశించి అన్నారు.
లేఖ ఇచ్చిన వారే యూ టర్న్: మల్లేష్
తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన వారే ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారని సిపిఐ శాసన సభా పక్ష నేత గూండా మల్లేష్ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.
అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడా: వివేక్
2004లోనే కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని అప్పుడు ప్రజలు కాంగ్రెసు పార్టీకి పట్టం కట్టారని, అప్పుడు లేని అభ్యంతరం సీమాంధ్ర నేతలకు ఇప్పుడెందుకని పెద్దపల్లి ఎంపి, తెరాస నేత వివేక్ ప్రశ్నించారు. హైదరాబాదులోని పెట్టుబడుల్లో 78 శాతం ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవే అన్నారు.
బాబుది విహార యాత్ర: గండ్ర
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తుఫాను బాధితులను పరామర్శించేందుకు వెళ్లినట్లుగా లేదని, విహార యాత్రకు వెళ్లినట్లుగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి ఎద్దేవా చేశారు.
సీట్ల పెంపు డిమాండ్ సరికాదు: దేవీప్రసాద్
తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రతిపాదన సరికాదని టిఎన్జీవో నేత దేవీప్రసాద్ అన్నారు. ఓ వైపు విభజన వైపు కేంద్రం అడుగులు వేస్తున్న సమయంలో సీట్ల పునర్విభజన డిమాండ్ సరికాదన్నారు. విభజన తర్వాత కూడా 371డిని కొనసాగించాలని విఠల్ అన్నారు.