వీజీటీఎం ఎంచుకుంటే ఇబ్బందే కానీ, ప్రజల మొగ్గు అటే!
హైదరాబాద్: విజయవాడ - గుంటూరు నగరాల మధ్యనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తే మౌలిక సదుపాయాలపై వత్తిడి, నగర విస్తరణలో ప్రణాళిక గందరగోళంగా తయారవుతుందని ఆంధ్ర రాష్ట్ర రాజధాని కమిటీ హెచ్చరించింది. శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదికలో విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి (విజిటిఎం) మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో తీవ్రపరిణామాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది.
దేశంలోనే అత్యంత విలువైన భూములు కృష్ణ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. విజిటిఎం పరిధిలో ప్రతిపాదిత రింగ్ రోడ్డును పునఃపరిశీలించాలని కోరింది. హైదరాబాద్ తరహా రింగ్ రోడ్డు వల్ల ఆర్ధికంగా తీవ్ర పరిణామాలు ఉత్పన్నమవుతాయి. భూముల రెట్లు ఆకాశాన్ని తాకుతాయి. విజిటిఎం పరిధిలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నెలకొల్పితే హైదరాబాద్ తరహాలో తేనేతుట్ట ఒకేలా ఉండే విధంగా తయారవుతుంది.
గన్నవరం విమానాశ్రయానికి పది కి.మీ దూరంలో కొండపావులూరులో 225 ఎకరాలు, ఉదురుపావులూరులో 150 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇక్కడ మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ప్రజలను పరిమితం చేయాల్సి ఉంటుంది. విజిటిఎంపై వత్తిడిని తగ్గించేందుకు నూజివీడు, ముసునూరు, అమరావతి లేదా పులిచింతలలో, గుంటూరు జిల్లా మార్టూరు-వినుకొండ మధ్య ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది.

వికేంద్రీకరణలో భాగంగా ఐటి పరిశ్రమను విశాఖలో, వ్యవసాయ సంబంధిత శాఖలను ప్రకాశం, పశుసంవర్ధక విభాగాన్ని ఒంగోలు, విద్యా సంస్ధలను అనంతపురం, నెల్లూరు జిల్లాలో వైద్య సంస్ధలు, కడపలో సంక్షేమ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి, అన్ని శాఖలను సిఎం ఆఫీసు ఉన్న చోటనే అక్కర్లేదని పేర్కొంది.
కాగా, రాజధానిగా విజయవాడ - గుంటూరు మధ్య ప్రాంతాన్నే మెజార్టీ ప్రజలు ఎంపిక చేశారు. శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదిక ద్వారా ఇది వెల్లడవుతోంది. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయమై ప్రజల నుంటి కమిటీ అభిప్రాయాలు సేకరించింది. 4,728 సలహాలు వచ్చాయి. ఇందులో 1,156 మంది విజయవాడ - గుంటూరు ప్రాంతం రాజధానిగా ఉండాలని పేర్కొన్నారు.
ఎక్కువ మంది మొగ్గు విజయవాడ - గుంటూరు వైపే
విజయవాడలోనే రాజధాని ఉండాలని 663 మంది, గుంటూరులో ఏర్పాటు చేయాలని 372 మంది సూచించారు. మొత్తంగా చూస్తే కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో రాజధాని ఉండాలని 2,191 మంది సూచించారు. రాజధానిపై అభిప్రాయం స్పష్టంగా చెప్పలేని వారు 1,037 మంది ఉన్నారు. 507 మంది విశాఖలో రాజధాని ఉండాలని, 116 మంది దొనకొండలో ఉండాలని, 113 మంది తిరుపతిలో ఉండాలని, 139 మంది రాజమండ్రిలో ఉండాలని.. ఇలా చెప్పారు. కర్నూలులో ఉండాలని 360 మంది చెప్పారు.
వికేంద్రీకరణ
ప్రభుత్వ కార్యాలయాల వికేంద్రీకరణ చర్చనీయాంశమై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకునేలా తాము సూచనలు చేసినట్లు శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. హైదరాబాదులో ఉన్న కార్యాలయాలను ఏ ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందనే అంశమై మరింత అధ్యయనం చేయాలని కోరామని, ఈ కసరత్తు సకాలంలో పూర్తి చేస్తే బాగుంటుందన్నారు.
అసెంబ్లీని తరలించేందుకు తొందర లేదని కమిటీ పేర్కొంది. అసెంబ్లీ సముదాయ నిర్మాణానికి 80-100 ఏకరాలు అవసరమని, అయితే ఇది కూడా కొంతకాలం హైదరాబాదులో నిర్వహించుకోవచ్చునని తెలిపింది. అధికార వికేంద్రీకరణతో పరిపాలన చేయాలని కమిటీ సూచించింది.












Click it and Unblock the Notifications