అమ్మాయిల పేర్లతో ఎఫ్బి ఖాతాలు: రూ. లక్షలు కాజేసిన నాగభూషణ్
కడప: ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని రూ. లక్షన్నర వరకు కాజేసి.. ఓ యువకుడి ఆత్మహత్యకు కారణమైన కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. కడప జిల్లా ఖాజీపేటకు చెందిన నరసింహ వరప్రసాద్ అలియాస్ రమేష్కు ఫేస్బుక్ ద్వారా అనురాధ అనే అమ్మాయి పరిచయమై రూ. లక్షన్నర వరకు తన ఖాతాలో జమ చేయించుకున్న విషయం తెలిసిందే.
అప్పులు చేసి, ఇంట్లో తెలియకుండా ఇచ్చిన ఆ మొత్తం ఆమె నుంచి తిరిగి రాకపోవడంతో రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి లక్ష్మీనర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు.
విశాఖపట్నం వెళ్లి నిందితుడి ఫోన్ నెంబర్లు, అకౌంట్ నెంబర్ ఆధారంగా కీలక సమాచారాన్ని సేకరించారు. కాగా, ఈ కేసులో నాగభూషణ్ అలియాస్ నాగ అనే యువకుడు కీలక సూత్రధారిగా తేలింది. అతడు అనురాధ అనే అమ్మాయితో ఈ తతంగాన్ని నడిపించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా ఈ కేసులో కొత్త కోణాలు వెలుగుచూశాయి.
విశాఖపట్నంకు చెందిన ప్రధాన నిందితుడు ఓ మెస్లో పని చేస్తున్నాడు. ఇతని తల్లి కళ్యాణి, అక్క మరో మెస్లో పని చేస్తున్నారు. 7వ తరగతి వరకు మాత్రమే చదివిని నాగ భూషణ్.. అమ్మాయిల పేర్లతో ఫేస్బుక్ ఖాతాలు తెరిచి అబ్బాయిలతో చాటింగ్ చేస్తాడు. అంతేగాక, అతడి నెంబర్ కూడా ఇస్తాడు. ఆ నెంబర్కు కాల్ వస్తే తన స్నేహితురాలు అనురాధతో మాట్లాడిస్తాడు.
ఈ క్రమంలోనే పరిచయమైన నరసింహ ప్రసాద్కు మాయమాటలు చెప్పి తన తల్లి కళ్యాణి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలో సుమారు రూ. 1.24లక్షలు వేయించుకున్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా నాగభూషణ్ తల్లి కళ్యాణిని పోలీసులు విచారించారు. తన బ్యాంక్ ఏటిఎం తన కుమారుడు నాగభూషణ్ వద్దే ఉంటుందని, అతడు ఏం చేస్తున్నాడో తెలియదని సమాధానం ఇచ్చింది.
కాగా, నాగభూషణ్ నెంబర్కు ఫోన్ చేయగా.. తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. తనకు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన అనురాధతోనే తాను నరసింహకు ఫోన్ చేయించినట్లు నిందితుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
అయితే, నాగభూషణ్ వాదన నమ్మేట్లుగా లేదు. ఎందుకంటే.. నరసింహకు వీరి నుంచి వచ్చిన మొత్తం ఫోన్ కాల్స్లో 80 సార్లు కళ్యాణి నుంచి, 50సార్లు, నాగభూషణ్ సెల్ నుంచి 55 సార్లకు పైగా నళిని సెల్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలిసింది. ఇది గమనిస్తే అసలు అనురాధ అనే అమ్మాయి ఉందా లేక తన తల్లి, సోదరితో కలిసి నాగభూషణ్ ఈ మోసానికి పాల్పడ్డాడా? అనే విషయం అనుమానంగా మారింది.
కాగా, కుటుంబమంతా రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా.. నాగభూషణ్ తల్లి కళ్యాణి మాత్రమే మంగళవారం ఖాజీపేట పోలీస్ స్టేషన్కు వచ్చింది. ఈ కేసులో ఆమెను ప్రశ్నిస్తున్నారు. కళ్యాణి బ్యాంక్ ఖాతాకు వివిధ ప్రాంతాల నుంచి నగదు వచ్చినట్లు తేలింది. గత సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు రూ. 3లక్షల వరకు జమ అయినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే వీరి బారిన పడిన నరసింహ లాంటి బాధితులు చాలా మందే ఉన్నట్లు తెలుస్తోంది. కళ్యాణిని విచారిస్తున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు నాగభూషణ్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.