మంచం పట్టిన మన్యం.. జ్వరాలతో గిరిజనం!
పార్వతీపురం మన్యం జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి .ముఖ్యంగా సాలూరు ప్రాంతంలో రోగుల సంఖ్య భారీగా పెరగడంతో స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి రోగులతో నిండిపోయింది. ఒక్కో గ్రామం నుంచి ఐదు నుంచి పది మంది వరకు జ్వరం, ఇతర లక్షణాలతో ఆసుపత్రికి చేరుతున్నారు. ఈ పరిస్థితి స్థానికుల్లో తీవ్ర ఆందోళనను సృష్టిస్తోంది.
ఒక్కో బెడ్ పై ముగ్గురికి వైద్యం
సాలూరు ప్రాంతీయ ఆసుపత్రిలో వార్డులు అన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రి సామర్థ్యం మించి రోగులు వచ్చిన కారణంగా ఒక్కో బెడ్ పై ముగ్గురికి వైద్యం అందిస్తున్న పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఒక్క రోజులోనే 63 మంది కొత్త రోగులు చేరగా, శనివారం మరో 31 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ జ్వరాలు ప్రభావితం చేసిన వారిలో చాలా మంది పిల్లలు ఉన్నారు.

జ్వర పీడితులుగా చిన్నారులు
కరడవలస గ్రామం నుంచి ఒక్కసారిగా ఎనిమిది మంది పిల్లలు ఆసుపత్రిలో చేరడం గమనార్హం. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం ప్రత్యేకంగా ఆందోళన కలిగిస్తోంది. అలాగే జిల్లేడువలస పంచాయతీ నారింజపాడు గ్రామంలోని మరో కుటుంబంలోని ముగ్గురు పిల్లలు కూడా జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రి వార్డులో చికిత్స పొందుతున్నారు.
పేషెంట్ లు పెరగటంతో మంచాల కొరత, సౌకర్యాలపై ఒత్తిడి
ప్రస్తుతం పిల్లల వార్డులో 15 మంచాలపై 43 మంది, మహిళల వార్డులో 12 బెడ్లపై 35 మంది, పురుషుల వార్డులో 20 మంచాలపై 46 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు. ఆసుపత్రి సిబ్బంది రోగుల సంఖ్యకు తగ్గట్టుగా సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. వైద్యులు, నర్సులు అందరూ అప్రమత్తంగా ఉన్నప్పటికీ మంచాల కొరత, సౌకర్యాలపై ఒత్తిడి పెరిగింది.
మన్యంలో వర్షాలతో సీజనల్ వ్యాధులు పెరిగే చాన్స్
మన్యం ప్రాంతంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానిక అధికారులు మరియు ఆరోగ్య శాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల్లో నివారణ చర్యలు, పురుగు మందులు చల్లడం, నీటి నిల్వలను శుభ్రం చేయడం వంటి పనులను వేగవంతం చేయాలని సూచిస్తున్నారు.
జ్వరాల బారి నుండి కాపాడమని మన్యం వాసుల విజ్ఞప్తి
ఈ జ్వరాల వ్యాప్తి కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు ఎక్కువగా బాధపడుతున్నారు. ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరం వచ్చిన వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications