పెట్రోనాస్ టవర్లలా: అమరావతి అద్భుత చిత్రాలు (పిక్చర్స్)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి 3డీ ఊహా చిత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం నాలుగు 3డీ ఊహా చిత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఊహా చిత్రాలే అద్భుతంగా ఉన్నాయి. అందమైన పెద్ద భవనాలు, విశాల రహదారులు, మెట్రో రైలు వంటి ప్రత్యేకలతో రాజధాని నగరాన్ని డిజైన్ చేశారు.
ఈ రాజధాని నిర్మాణంలో భాగంగా పచ్చదనానికి పెద్దపీట వేసినట్లుగా కనిపిస్తోంది. అమరావతి నగరాన్ని న్యూయార్క్ మన్హటన్, లండన్, ప్యారిస్ స్టైల్ థీమ్లో నిర్మించనున్నట్లుగా కనిపిస్తోంది.
కాస్మొపొలిటి సిటీలైన లండన్, ప్యారిస్ హడ్సన్, థేమ్స్ నదీ పరివాహంలో నిర్మించబడ్డాయని, అమరావతి కూడా కృష్ణా జిల్లాకు సరసన నిర్మించబడుతోందని చెబుతున్నారు.

అమరావతి
ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అమరావతిలోని సీడ్ క్యాపిటల్ రూపురేఖలు బయటికొచ్చాయి. సింగపూర్ ప్రభుత్వం ఈ నెల 20న రాజమండ్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించబోయే రాజధాని కీలక ప్రాంత (సీడ్ క్యాపిటల్) బృహత్తర ప్రణాళికలోని కొన్ని ఛాయాచిత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. కృష్ణానది ఒడ్డున గుంటూరు జిల్లా పరిధిలో 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో (4176 ఎకరాల విస్తీర్ణం) సీడ్ క్యాపిటల్ ఉంటుంది. ఇందులోని కొంతభాగంలో సమస్త పరిపాలనా భవన సముదాయం ఏర్పాటవుతుంది.

అమరావతి
మిగతా ప్రాంతాల్లో ఐటీ హబ్లు, కార్పొరేట్ సంస్థలను నెలకొల్పే విధంగా బృహత్తర ప్రణాళిక రూపొందించినట్లు ఛాయాచిత్రాలు చెబుతున్నాయి. రాజధానిలోని రహదారులకు సమాంతరంగా కాలువలను తీర్చిదిద్ది ఆ నీళ్లు మళ్లీ కృష్ణానదిలో కలిసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతిచోటా కాలువలకు ఇరువైపులా ఆకాశహార్మ్యాలను నిర్మించ తలపెట్టారు. భవనాల పరిసరాలతోపాటు, వాటిపైనకూడా పచ్చదనం పెంపొందించే విధంగా ప్రణాళికకు ప్రాణం పోశారు. నగరాన్ని పక్కా ప్రణాళికతో రూపొందించేందుకు 4176.159 ఎకరాలన్ని సెక్టార్లుగా విభజించారు.

అమరావతి
రహదారులను ఆరు వరుసలతో రూపొందించారు. వాటిపక్కనే ఫుట్పాత్లు, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేశారు. నగరం మధ్యనుంచి మెట్రో రైలు వెళ్లనుంది. స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉన్నాయి. 25 అంతస్తులతో ఐటీ హబ్కు రూప కల్పన చేశారు. సీడ్ క్యాపిటల్ పరిధిలోకి మళ్లించే కాలువలనీటితో అందమైన జలాశయానికి రూపకల్పన చేశారు. ఈ కాలువలు దాటేందుకు వీలుగా ప్రధాన పరిపాలనా ప్రాంగణానికి రెండు వైపులా రెండు ఆకర్షణీయమైన వూయలవంతెనలు తలపెట్టారు.

అమరావతి
అమరావతికి తలమానికంగా నిలిచేలా మలేషియాలోని పెట్రోనాస్ టవర్ల తరహాలో జంట టవర్లను నిర్మించనున్నారు. సీడ్ క్యాపిటల్కు అభిముఖంగా కృష్ణానదిలో గుంటూరు జిల్లావైపున ఉన్న చిన్న ద్వీపాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయబోతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే విధంగా కృష్ణానదిపై ఎత్త్తెన వంతెన తలపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సీడ్ క్యాపిటల్ ప్రతిబింబ చిత్రాలు ఈ విషయాలను చాటుతున్నాయి.












Click it and Unblock the Notifications