జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టులో లేటెస్ట్ పిటీషన్: దాన్ని అడ్డుకోవాలంటూ: నేడో, రేపో
అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలయ్యే పిటీషన్ల పరంపరకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించట్లేదు. ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా ఉంది ఫిర్యాదుదారుల పరిస్థితి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కేసు ముగిసిన వెంటనే మరో కేసులు వరుసబెట్టి హైకోర్టులో దాఖలు అవుతున్నాయి. ప్రభుత్వ భవనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగుల వివాదంలో ప్రభుత్వానికి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు నుంచి కూడా ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ కేసు ముగిసిన వెంటనే మరో పిటీషన్ దాఖలైంది.
ఎస్ఈబీ ఏర్పాటుపై..
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటును వ్యతిరేకిస్తూ తాజాగా ఈ పిటీషన్ దాఖలైంది. ఎస్ఈబీని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 41ని రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి దీన్ని పిటీషన్ వేశారు. ఏపీ ఎక్సైజ్ చట్టానికి విరుద్ధంగా ఈ జోవో ఉందని, ఎస్ఈబీకి చట్టబద్ధత లేదని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖలో గానీ పోలీసు శాఖలో గానీ ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ జీవోను ఎలా అమలు చేస్తారనేది స్పష్టంగా ప్రభుత్వం పేర్కొనలేదని, చట్టబద్ధత లేని ఈ బ్యూరో కేసులను నమోదు చేయలేదని స్పష్టం చేశారు. దీన్ని హైకోర్టు విచానణకు స్వీకరించింది.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పేరుతో..
సంపూర్ణ మద్యపానం నిషేదాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తరువాత అక్రమ మద్యాన్ని అరికట్టడానికి ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (Special Enforcement Bureau) పేరుతో కొత్త శాఖను సృష్టించింది. ఈ మేరకు రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దులను దాటుకుని రాష్ట్రంలోనికి ప్రవేశించే అక్రమ మద్యాన్ని నిరోధించడం, రాష్ట్రం లోపన అక్రమ మద్యం తయారీని అణచివేయడం, మద్యం తయారీదారులపై ఉక్కుపాదాన్ని మోపడం వంటి చర్యలను ఈ కొత్తశాఖకు అప్పగించింది.
కీలక అధికారాల అప్పగింత.. అక్రమ ఇసుక తవ్వకాలు కూడా..
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు పని విభజనను సైతం కేటాయించింది ప్రభుత్వం. అక్రమ మద్యం తయారీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఆకస్మిక దాడులను నిర్వహించడం, ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం, నిందితులను న్యాయస్థానంలోకి ప్రవేశపెట్టడం, కేసు దర్యాప్తు, ఛార్జిషీట్లను రూపొందించడం, నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లను కూడా జారీ చేసే అధికారాలను సైతం ప్రభుత్వం ఈ కొత్త శాఖకు బదలాయించింది. సాధారణ పోలీసులకు వర్తించే అన్ని అధికారాలనూ దీనికి అప్పగించింది. అక్రమ ఇసుక తవ్వకాలను కూడా ఈ బ్యూరో పరిధిలోకి తీసుకొచ్చింది.
70:20 నిష్పత్తిలో ఉద్యోగులు..
ప్రారంభంలో డెప్యుటేషన్తోనే ఉద్యోగులను కేటాయిస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ డిస్టిల్లేషన్ బేవరేజ్ కార్పొరేషన్ నుంచి 70 శాతం, ఎక్సైజ్ శాఖ నుంచి 30 శాతం ఉద్యోగులను ఈ బ్యూరోకు బదలాయింంచింది. భవిష్యత్తులో కూడా 70:30 నిష్పత్తి ప్రకారమే ఉద్యోగులు ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో కొనసాగుతారని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం. ఖాళీలను భర్తీ చేయడానికి కాలానుగుణంగా నోటిఫికేషన్లను జారీ చేస్తామని పేర్కొంది.
Recommended Video
ఆరువేల మందికి పైగా..
ఈ కొత్త శాఖలో ఆరువేల మందికి పైగా ఉద్యోగులను నియమించింది. మంజూరైన పోస్టులు, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, డ్రైవర్లు.. ఇలా మొత్తం 6274 మంది ఉద్యోగులు ఈ శాఖలో పనిచేస్తారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా ఈ శాఖకు కేటాయించారు. ఈ శాఖతో పాటే ఆవిర్భవించిన ఆయా ఖాళీలన్నింటినీ భర్తీ చేయడానికి ప్రభుత్వం కొత్త నియామకాలను నిర్వహిస్తుందా? లేక ఇతర శాఖల నుంచి డెప్యుటేషన్పై సర్దుబాటు చేస్తుందా? స్పష్టం కావాల్సి ఉంది.