సీఎం జగన్ కు మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు - మంత్రికి ఫోన్ చేసి మరీ..!!
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. జనసేన -టీడీపీ మధ్య పొత్తు దాదాపు ఖారరైంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైన ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇదే సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రభుత్వానికి అండగా నిలిచారు. సీఎం జగన్ నిర్ణయాలను అభినందించారు. నేరుగా ఏపీ మంత్రికి ఫోన్ చేసి ప్రభుత్వ పని తీరును మెచ్చుకున్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఇతర రాష్ట్రాలకు కొనసాగిస్తున్నాయంటూ మాజీ జేడీ చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1 సరైనదే
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను మాజీ జేడి మద్దతు ఇచ్చారు. ఇది సరైన నిర్ణయంగా పేర్కొన్నారు. తమను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోగా చంద్రబాబు..పవన్ ఆరోపించారు. దీని పైన హైకోర్టులో పిల్ దాఖలైంది. దీంతో, హైకోర్టు తాత్కాలికంగా జీవోను ఈ నె 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జీవో ద్వారా సామాన్యులకు ఇబ్బంది లేకుండా పోలీసులు పరిశీలించి అనుమతులు ఇస్తారని మాజీ జేడీ వివరించారు. ప్రతీ విషయాన్ని పార్టీలు రాజకీయం చేయాలనుకుంటే ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఈ జోవోను కొట్టివేయలేదని..తాత్కాలికంగా సస్పెండ్ మాత్రమే చేసిందని మాజీ జేడీ వివరించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం వంటి డిమాండ్లు మంచివి కావని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ పని తీరు భేష్ అంటూ..
శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వం నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని పరిశీలించారు. కిడ్నీ రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని అభినందించారు.కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వాలు పని చేయలేదని వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయిన వెంటనే ఈ ఆస్పత్రి నిర్మించటం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఉద్దానంలో ఇంటింటికీ మంచి నీరు అందించేందుకు రూ 700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించటం గొప్ప పనిగా మాజీ జేడీ పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలోనే పెద్ద ప్రాజెక్టుగా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో తాను దత్తత తీసుకున్న సహలాలపుట్టుగను లక్ష్మీనారాయణ తాజాగా సందర్శించారు. స్థానిక సమస్యలపైన లక్ష్మీనారాయణ స్పందించారు.

మంత్రికి ఫోన్ చేసి అభినందనలు
మాజీ జేడీ లక్ష్మీనారాయణ అక్కడి నుంచే జిల్లా మంత్రి సిదిరి అప్పలరాజుకు ఫోన్ చేసారు. ప్రభుత్వం కిడ్నీ ఆస్పత్రి.. ఉద్దానంలో మంచి నీరు అందించేందుకు తీసుకుంటున్న చర్యల పైన అభినందించారు. మంత్రి ఈ ప్రాజెక్టు గురించి ప్రభుత్వ ఆలోచనలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి బరిలో స్వతంత్ర అభ్యర్ధిగా నిలుస్తానని ఇప్పటికే మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న వేళ.. మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రభుత్వానికి మద్దతుగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి. లక్ష్మీనారాయణ గతంలో జనసేన నుంచి పోటీ చేసినా ఇప్పుడు పార్టీలకు దూరంగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications