YS Jagan: రేపు మళ్లీ బెంగళూరు వెళ్లిపోతున్న జగన్ ..!
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నారు. గతవారమే బెంగళూరు పర్యటన పూర్తి చేసుకుని విజయవాడ చేరుకున్న జగన్.. తిరిగి రేపు అక్కడికే వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందించారు. రేపు ఉదయం తాడేపల్లి నివాసంలో అందుబాటులో ఉండనున్న జగన్.. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి బెంగళూరుకు పయనం కాబోతున్నారు.
రేపు మధ్యాహ్నం 3.45కి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న జగన్.. 4.20కి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు కెంపేగౌడ ఎయిర్ పోర్టుకు పయనం అవుతారు. 6.40కి కెంపెగౌడ విమానాశ్రయంలో దిగనున్న జగన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరులోని యలహంక నివాసానికి పయనం అవుతారని అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్న వైఎస్ జగన్.. మధ్యలో మాత్రం తాడేపల్లి వచ్చి వెళ్తున్నారు. మధ్యలో ఢిల్లీలో ధర్నాకు కూడా హాజరయ్యారు. ఇప్పటివరకూ రెండుసార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ తొలిరోజు మాత్రం హాజరై తిరిగి వెళ్లిపోయారు. దీంతో అధికార టీడీపీ, జనసేన నేతలు జగన్ పై విమర్శలు సంధిస్తున్నాయి. గతంలో చంద్రబాబు, పవన్ హైదరాబాద్ లో ఉంటారని, రాష్ట్రానికి అతిధుల్లా వచ్చి వెళ్లిపోతారని విమర్శించే వారని, ఇప్పుడు జగన్ చేస్తుంది ఏంటని ప్రశ్నిస్తున్నాయి.












Click it and Unblock the Notifications