ఆల్ సెట్- మొక్కులు చెల్లించిన సాయిరెడ్డి
Vijayasai Reddy: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 74,344 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,169 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.05 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అయిదు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి.. శ్రీవారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఈ తెల్లవారు జామున శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తొలుత స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. తన మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులవారి మండపంలో విజయసాయిరెడ్డికి వేదాశీర్వచనాలు పలికారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శేషవస్త్రాన్ని బహూకరించారు. ఆలయం వెలుపల సాయిరెడ్డితో మాట్లాడటానికి విలేకరులు ప్రయత్నించగా.. ఆయన పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు.
ఆవిర్భావం నుంచీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి ఇప్పుడు రాజకీయాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం ఆయన మద్యం కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటోన్నారు. సిట్ విచారణకూ పలుమార్లు హాజరయ్యారు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీలో చేరొచ్చనే ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది.
ఈ దఫా బీజేపీ నుంచి మళ్లీ రాజ్యసభకు నామినేట్ అవుతారంటూ ప్రచారం జరిగినప్పటికీ అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు. ఆయన రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి పాకా సత్యనారాయణ పేరును ప్రకటించింది బీజేపీ. అయినప్పటికీ- మున్ముందు రాజకీయాల్లో సాయిరెడ్డి పునఃప్రవేశం చేస్తారని, క్రియాశీలకంగా వ్యవహరిస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications