మేం చెప్పేది ప్రివిలేజ్ కమిటీ వినట్లేదు: వైసిపి ఎమ్మెల్యే, హాజరైన 4గురు
అమరావతి: సభా హక్కుల సంఘం తాము చెప్పేది వినడం లేదని, ఏం చేయాలో కమిటీ ముందే నిర్ణయించుకుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంగళవారం నాడు అన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఈ రోజు వైసిపి సభ్యులు నలుగురు హాజరయ్యారు.
హాజరైన అనంతరం వైసిపి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విలేకరులతో మాట్లాడారు. తాము ఏం చెప్పినా వినడం లేదని, వారు ముందే అన్నీ నిర్ణయించుకున్నారని చెప్పారు. తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే తమ పైన చర్యలు తీసుకోవాలనుకోవడం విడ్డూరమన్నారు.
ప్రివిలేజ్ కమిటీలో తమకు ఒకే సభ్యుడు ఉన్నాడని చెప్పారు. మరొకరికి అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఉదయం ఏపీ శాసనసభలో సభా హక్కుల సంఘం సమావేశమైంది. హక్కుల సంఘం ఎదుట నలుగురు వైసిపి ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొందరు వైసిపి సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. సభా హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించిన 12 మంది వైసిపి ఎమ్మెల్యేలకు సభా హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ విచారణకు నలుగురు ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, దాడిశెట్టి రాజా, జగ్గిరెడ్డి, శివప్రసాద్ రెడ్డి హాజరయ్యారు.