అజిత్ అగార్కర్ కు మూడింది: చీఫ్ సెలెక్టర్ రేసులో మనోడే ఫ్రంట్ రన్నర్.. !!
బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీలో త్వరలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం చీఫ్ సెలక్టర్గా కొనసాగుతున్న అజిత్ అగార్కర్ స్థానంలో మరో టీమిండియా లెజెండరీ ప్లేయర్ రానున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు సెలెక్షన్ కమిటీ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేయాలని బీసీసీఐ యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ కూడా బీసీసీఐ ఆయన పదవీకాలాన్ని తాత్కాలికంగా మూడు నెలల పాటు పొడిగించింది. ఈ పొడిగించిన గడువు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ముగిసిపోతుంది. ఇకపై ఆయన కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగించకూడదనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు చెబుతున్నారు. నిజానికి ఆయనను వరల్డ్ కప్ ముగిసేంత వరకూ కదిలించకూడదని మొదట భావించినప్పటికీ.. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మార్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

అగార్కర్ హయాంలో టీమిండియా ప్రపంచ క్రికెట్లో తిరుగులేని శక్తిగా అవతరించింది. మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకోవడం దీనికి నిదర్శనం. ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు జట్టుకు కలిసొచ్చాయని, అందుకే ఆయన కొనసాగాలని కోరుకుంది కూడా. అగార్కర్ నేతృత్వంలో భారత్ సుదీర్ఘ ఐసీసీ టైటిల్ కరవును కూడా తీర్చింది. 2024, 2026 లలో వరుసగా టీ20 ప్రపంచ కప్లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని సైతం సొంతం చేసుకుంది. 2023లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు కూడా చేరింది.
ఈ మధ్యకాలంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో పొరపాట్లు చోటు చేసుకున్నాయనే నిర్ణయానికి వచ్చింది బీసీసీఐ. ఇది జట్టు విజయాల పరంపరకు ప్రతికూలంగా మారిందని భావిస్తోంది. ఈ నేపత్యంలో సెలెక్షన్ కమిటీలో మార్పులు చేయాలని యోచిస్తోంది. అజిత్ అగార్కర్ స్థానంలో టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ను నియమించాలనే ప్రతిపాదనలను బీసీసీఐ పరిశీలిస్తోంది. ప్రస్తుతం వీవీఎస్.. బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కొత్త ల్యాబ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ చీఫ్ గా కొనసాగుతున్నారు.
అలాగే.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనంపై కూడా బీసీసీఐ చర్చించనున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టు తరఫున మంచి ప్రదర్శన ఇస్తున్నప్పటికీ షమీ చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఫిట్నెస్ కారణాల వల్లే అతడిని ఎంపిక చేయట్లేదని సెలెక్షన్ కమిటీ గతంలో స్పష్టం చేసింది. రంజీ వంటి దేశవాళీల్లో రాణిస్తున్న షమీకి జాతీయ జట్టులో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ వీవీఎస్ లక్ష్మణ్ కొత్త చీఫ్ సెలక్టర్గా అపాయింట్మెంట్ అయితే.. షమీ కెరీర్కు మళ్లీ ఊపు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో పటిష్టమైన బౌలింగ్ ను సమకూర్చుకోవడం ఇప్పుడు భారత జట్టుకు అత్యంత కీలకం. దీంతో పాటు మూడు ఫార్మాట్లలో సమర్థులైన ఆల్ రౌండర్ల సమతుల్యతను కాపాడటమే కొత్తగా ఏర్పడే సెలక్షన్ కమిటీ ముందున్న అత్యంత ప్రధానమైన సవాలుగా నిలవనుంది.













Click it and Unblock the Notifications