జగన్ ఆయుధాలతో చంద్రబాబు, పవన్ యుద్దం - గెలుపు దక్కేదెవరికి..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ ధీమాగా కనిపిస్తున్నారు. జగన్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన లాంఛనమే. తన వారాహి యాత్రలో పవన్ సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లోకి వెళ్లింది. లక్ష్యం చంద్రబాబు..పవన్ ఇద్దరిదీ ఒకటే అయినా..ఆ ఇద్దరు జగన్ పైన పోరాటానికి సిద్దం చేసుకున్న అస్త్రాలు..ఆయుధాల పై చర్చ మోదలైంది. వీటితో ఎన్నికల యుద్దం గెలవగలరా.
పక్కా ప్లాన్ తో జగన్ : సీఎం జగన్ 2024 ఎన్నికల్లో గెలుపు కోసం 2019 అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బ కొట్టిన జగన్..తన క్రెడిబులిటీ నిలుపుకోవటంలో మాత్రం సక్సెస్ అయ్యారు. చంద్రబాబు..పవన్ 2014లో కలిసి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ అమలు చేయలేదంటూ హామీలను విస్మరించిన చంద్రబాబు...ప్రశ్నించని పవన్ ను నిలదీసారు. అదే సమయంలో తాను చెప్పిన ప్రతీ మాట నిలబెట్టుకున్నానని చెప్పటం ద్వారా మరింత ఆత్మవిశ్వసంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తాను చేసిన మంచే తన బలమని చెబుతున్నారు. సామాజిక న్యాయం..సంక్షేమం ఆయుధాలుగా జగన్ ఎన్నికలకు సిద్దమయ్యారు.

చంద్రబాబు సంక్షేమం బాట : ఇప్పుడు జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు సంక్షేమం బాట పట్టారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమం కారణంగా రాష్ట్రం ఆర్దికంగా నష్టపోతుందని ప్రచారం చేసిన టీడీపీ..ఇప్పుడు అదే సంక్షేమం ఆయుధం గా ప్రజల మధ్యకు వెళ్తోంది. జగన్ కంటే అదిరిపోయే సంక్షేమం అమలు చేస్తామని చెబుతోంది. మహానాడు వేదికగా ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తోంది.
అందులో కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడ ప్రకటించిన హామీలనే ఇక్కడ మేనిఫెస్టోగా కాపీ కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ తన సంక్షేమ పథకాలు మహిళ ఓట్ బ్యాంకు లక్ష్యంగా అమలు చేస్తున్నారు అదే బాటలో చంద్రబాబు పయణిస్తున్నారు. దీంతో...అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పే మాటల కంటే..అమలు చేస్తున్న వాటికే ఎక్కువ ఆదరణ ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఏం చెప్పినా అమలు చేయరనే ప్రచారం వైసీపీ వ్యూహాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.
నాటి వైసీపీ నినాదంతో నేడు పవన్ : జగన్ నమ్ముకున్న ఎన్నికల ఆయుధం సంక్షేమాన్ని చంద్రబాబు ఇప్పుడు తన అస్త్రంగా మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో హాయ్ ఏపీ..బైబై వైసీపీ అనే నినాదం ప్రజల్లో వినిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నాడు బైబై బాబు అంటూ పెద్ద ఎత్తన నినదించింది. షర్మిల..రోజా తో పాటుగా అనేక రీల్స్ సోషల్ మీడియాలో ఇదే స్లోగన్ తో పోస్టు అయ్యాయి. ఇప్పుడు పవన్ అదే తరహాలో స్లోగన్ ఎంపిక చేసుకోవటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పవన్ ప్రతీ సభలో జగన్ ను విమర్శిస్తున్నారు. కానీ, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పటం లేదు. జగన్ నమ్ముకున్న ఎన్నికల అస్త్రాలనే ఇప్పుడు చంద్రబాబు..పవన్ నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. దీంతో..మరి ఈ అస్త్రాలు గురి కుదిరేదెవరికి..గెలుపు దక్కేదెవరికో చూడాలి.












Click it and Unblock the Notifications