జగన్ది యువభేరి కాదు.. కుర్చీభేరి, విద్యార్థులూ! టైం వేస్ట్ చేసుకోవద్దు: గాలి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్ జగన్ యువభేరి పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నాడని, ఆయన చేసేది యువభేరి కాదని... సిఎం కుర్చీ భేరి అని విమర్శించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం జగన్ కేంద్రాన్ని, ప్రధాని మోడీని నిలదీయకుండా సీఎం చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
అసలు రాష్ట్ర విభజనకు బీజం వేసింది వైయస్ రాజశేఖరరెడ్డి అని, ఇప్పుడు జగన్ చదువుకుంటున్న విద్యార్థులను రెచ్చగొడుతూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రత్యేక హోదా కోసం, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తుంటే.. సహకరించాల్సింది పోయి జగన్ అభివృద్ధిని అడ్డుకొంటున్నారని ధ్వజమెత్తారు. పలు కేసుల్లో బెయిల్ కోసం కాంగ్రెస్కు అమ్ముడుపోయిన జగన్ ప్రత్యేక హోదా అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
జగన్ మాటలు నమ్మి విద్యార్థులు విలువ సమయాన్ని వృథా చేసుకోవద్దని ఆయన కోరారు. సెప్టెంబర్ 26న గుంటూరులో చేపట్టే నిరాహారదీక్ష ద్వారా జగన్ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలో దీక్ష చేసి మోడీని కలవకుండా వచ్చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని గాలి ముద్దు కృష్ణమనాయుడు స్పష్టం చేశారు.