స్పీకర్ సీమాంధ్ర ప్రేమ: గండ్ర, ఫిబ్రవరి 22లోగా తెలంగాణ
హైదరాబాద్: సభాపతి నాదెండ్ల మనోహర్ తనకున్న సీమాంధ్ర ప్రేమను చూపించుకున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ గురువారం అన్నారు. శాసన సభ నిరవధిక వాయిదా పడిన అనంతరం గండ్ర విలేకరులతో మాట్లాడారు. బిల్లు పైన చర్చ పూర్తయిందన్నారు. కిరణ్ ఓ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కిరణ్ నోటీసు పైన మూజువాణి అభిప్రాయం తీసుకొని సభాపతి సీమాంధ్ర ప్రేమ చూపించారని మండిపడ్డారు.
సంఖ్యాబలం ఉందని మందబలంతో కిరణ్, చంద్రబాబు, జగన్ ఒక్కటై మా గొంతు నొక్కే ప్రయత్నాలు చేశారని, వారు తెలంగాణ పాలిట యమకింకరులు అని, వారు తెలంగాణ ద్రోహులు అని ధ్వజమెత్తారు. నైతిక విజయం తెలంగాణ ప్రజలదే అన్నారు. సభలో తెలంగాణ ఎమ్మెల్యేల గొంతు నొక్కే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. టి బిల్లు పైన అభిప్రాయం మాత్రమే చెప్పమన్నారని ఓటింగు అడగలేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు.
ఇది తెలంగాణ ప్రజల విజయమని చెప్పారు. త్వరలో తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పారు. 22వ తేదీ లోపు రెండు రాష్ట్రాల ప్రక్రియ ఏర్పాటు పూర్తవుతుందన్నారు. తాము కోరుకున్నట్లే చర్చ జరిగిందని టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. బిల్లు ఓడిందా లేదా గెలిచిందా అనేది తాము పట్టించుకోమన్నారు.
తెలంగాణ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమం వల్లనే తెలంగాణ సాధ్యమైందన్నారు. స్పీకర్ చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదన్నారు. స్పీకర్ వ్యవస్థను కిరణ్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారని ధ్వజమెత్తారు. అభిప్రాయాలతో సంబంధం లేకుండా రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేదని... టిజి వెంకటేష్
తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేదని తాము తిరస్కరించామని మంత్రి టిజి వెంకటేష్ వేరుగా అన్నారు.