మాపార్టీలోకి రండి: టిటిడిపికి గండ్ర, బాబు దుకాణం క్లోజ్
వరంగల్/నల్గొండ: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి శుక్రవారం ఉదయం వరంగల్లో అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్ అయిందన్నారు. ఆ పార్టీ దుకాణం మూసేసినందున టిటిడిపి నేతలు వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు.
సభాపతి నాదెండ్ల మనోహర్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. దానికి ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము సభా హక్కుల నోటీసు ఇస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో జగన్పై సభా ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తామని గండ్ర వెల్లడించారు.
సమన్యాయం నుండి సమైక్యం: గుత్తా
ఇప్పుడు సమన్యాయం అంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు మూడు రోజుల్లో సమైక్యవాదం అంటారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తమ భవిష్యత్తు పైన ఆలోచించుకోవాలని హితవు పలికారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రాష్ట్రపతికి సమైక్యాంధ్ర అంటూ అఫిడవిట్లు దాఖలు చేయడం హాస్యాస్పదమన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలు లౌకికవాదులు, మతతత్వా పార్టీల మధ్య పోటీయే అన్నారు.