అధ్యాపకునిపై విద్యార్థిని దాడి, ప్రేమించి మోసం చేశాడని ఆరోపణ
హైదరాబాద్: గుంటూరు జిల్లా నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలో శనివారం దారుణం జరిగింది. ఓ అధ్యాపకునిపై విద్యార్థిని యాసిడ్తో దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లెక్చరర్ వెంకటరమణను ఆస్పత్రికి తరలించారు. లెక్చరర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కాగా తనను వివాహం చేసుకుంటానని వెంకటరమణ మోసం చేశాడని.. విద్యార్థిని సౌజన్య ఆరోపించింది. అందుకే యాసిడ్ దాడికి పాల్పడినట్లు ఆమె చెబుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నల్లపాడు మైనారిటీ పాలిటెక్నిక్ కళాశాలలో వెంకటరమణ గణిత అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. నర్సారావుపేటకు చెందిన సౌజన్య అనే యువతితో కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతున్నట్లు సమాచారం.
వివాహం చేసుకుంటానని యువతిని గత కొంతకాలంగా నమ్మిస్తూ వచ్చిన వెంకటరమణ ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన మరో యువతిని రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఆలస్యంగా తెలుసుకున్న సౌజన్య శనివారం కళాశాలకు తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్ను ముఖంపై చల్లింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సౌజన్యను అదుపులోకి తీసుకున్నారు.
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్
ఇదిలావుంటే, గుంటూరు జిల్లాలోని మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళల వసతి గృహంలో సీనియర్ మెడికోలు జూనియర్లను వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. వేధింపులు తాళలేక హాస్టల్ ఖాళీ చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని ఈ విషయంపై సీఎం పేషీలో ఫిర్యాదు చేశారు.
సీఎం పేషీ ఆదేశాల మేరకు గత రాత్రి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ విద్యార్థులను ప్రిన్సిపాల్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
పాఠశాల సమీపంలో పేలుడు
ప్రకాశం జిల్లా చీరాల మండలం ఓడరేవు గ్రామంలోని కస్బూర్బా గాంధీ పాఠశాల సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు .పాఠాశాల సమీపంలోని రాళ్ల గుట్టను ఇద్దరు విద్యార్థులు కదిలించడంతో ఈ ప్రమాదం సంభవించింది. బాంబు పేలుడుగా స్థానికులు అనుమానిస్తున్నారు.