మాట మారింది!: రాయల టిని కొట్టేయని డిగ్గీ, బిల్లుపైనా
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాయల తెలంగాణ ప్రతిపాదన పైన సీరియస్గా ఆలోచిస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ పర్యవేక్షకులు, మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు దిగ్విజయ్ సింగ్ సోమవారం మాట్లాడుతూ.. రాయల తెలంగాణకు సంబంధించిన అంశాన్ని తోసిపుచ్చలేమని అభిప్రాయపడ్డారు.
అధిష్టానం రాయల తెలంగాణపై ఆలోచిస్తోందా అని విలేకరులు ప్రశ్నిస్తే.. ఇప్పుడు ఏ అంశాన్ని కొట్టి పారేయలేమని చెప్పారు. తద్వారా అధిష్టానం రాయల తెలంగాణ పైన సీరియస్గా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాయల తెలంగాణపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, జివోఎం భేటీ అనంతరం స్పష్టత వస్తుందన్నారు.

గతంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడిన పలు సందర్భాల్లో సిడబ్ల్యూసి నిర్ణయం మేరకే విభజన ఉంటుందని, ముఖ్యమంత్రి సహా అందరు దానికి కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం రాయల తెలంగాణను కొట్టి పారేయలేమని చెబుతున్నారు.
అదే సమయంలో శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వచ్చే అవకాశముందన్నారు. జివోఎం ప్రక్రియ మాత్రం త్వరలో ముగుస్తుందని చెబుతున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో చర్చించిన అంశాలపై తాను బయటకు చెప్పలేనని, అవి ప్రయివేటు విషయాలన్నారు.
కాగా, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో రెండు రోజుల క్రితం ఢిల్లీ పెద్దలు రాయల తెలంగాణ అంశంపై చర్చించిన విషయం తెలిసిందే. రాయల తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలను ఒప్పించే ప్రయత్నాలు అధిష్టానం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications