జెరూసలేం యాత్రికులకు సాయం పెంపు :విధి విధానాలు ఇలా: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హమీని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగునంగా అమలుకు ఆదేశాలిచ్చింది. ఏపీ నుండి జెరూసలేం వెళ్లే యాత్రికులకు ఆర్దిక సాయం పెంచుతూ ప్రభుత్వం విధి విధానాలతో కూడిన ఉత్తర్వులు ఇచ్చింది. రూ.3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఇచ్చే సాయం రూ.40 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అదే విధంగా.. రూ. 3 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్న వారికి రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంపుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, జెరూసలేంతో పాటు ఇతర క్రైస్తవ ప్రార్ధనా స్ధలాల సందర్శనకు ఆర్ధిక సాయం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఆర్ధిక సాయం పెంపుపై గత కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్..ఇప్పుడు కేబినెట్ నిర్ణయాలను అమలు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
ముఖ్యమంత్రి జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు మరో కీలక నిర్ణయం అమలుకు ఉత్తర్వులు జారీ చేసారు. జెరూసలేం వెళ్లే యాత్రికులకు ఆర్దిక సాయం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఇమాంలు..మౌజంలకు సైతం గౌరవ వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయితే, దీనికి కొంత సమయం కావాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ నెల 14న ఒంగోలులో జరిగిన పాఠశాలల నాడు...నేడ సభలో ముఖ్యమంత్రి దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేసారు.
రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితుల కారణంగా తనకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్దించారు. వచ్చే మార్చి నాటికి వారికి సైతం చెప్పిన విధంగా గౌరవ వేతనాలు అందిస్తామని స్పష్టం చేసారు. ఇక, మదర్సాల్లో చదువుతున్న విద్యార్ధులకు ఆధ్మాత్యిక అంశాలతో పాటుగా ఆధునిక విద్యను సతం అందిస్తామని చెప్పుకొచ్చారు. అక్కడ చదివే విద్యార్ధులకు సైతం అమ్మ ఒడి అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్ ను ఆదేశించారు. ఇప్పుడు, ప్రభుత్వం క్రైస్తవులకు సంబంధించిన జెరూసలేం యాత్రికులకు ఆర్దిక సాయం పెంచుతూ నిర్ణయం అమల్లోకి వచ్చింది.