నవ నిర్మాణ దీక్షపై చంద్రబాబు: అచ్చం కేసీఆర్ లాగే ఏపీలో సమగ్ర సర్వే
అమరావతి: జూన్ 2న ఉదయం 11 గంటలకు నవ నిర్మాణ దీక్ష ఉంటుందని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నవ నిర్మాణ దీక్ష చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జూన్ 2న చేపట్టే నవ నిర్మాణ దీక్ష, జూన్ 8న చేపట్టే మహా సంకల్ప దీక్షపై అందుబాటులో ఉన్న మంత్రులు, జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. జూన్ 3వ తేదీన రాష్ట్ర విభజనపై చర్చలు, దాని ప్రభావం, విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులను చర్చించాలని సూచించారు. జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కుటుంబ సమగ్ర సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సర్వే తరహాలో ఏపీలో కూడా జూన్ 15 నుంచి రాష్ట్రంలో పల్స్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కులాల వారీగా ఈ సర్వే చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
ఈ సమగ్ర సర్వే ద్వారా రాష్ట్ర ప్రజల పూర్తి వివరాలు ప్రభుత్వానికి తెలుస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. సమగ్ర సర్వేపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆయన ప్రజలకు సూచించారు. ఈ సర్వే ద్వారా సంక్షేమ పథకాల్లో కోత ఉండదని ఆయన చెప్పారు. రిజర్వేషన్లు ఇచ్చేందుకు సమగ్ర సర్వే నివేదిక ఉపయోగపడుతుందని అన్నారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ముద్రగడ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్కు ఏపీ ప్రభుత్వం ఈ నివేదికను ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలోని వివిధ కులాల ఆర్థిక స్తోమతను తెలుసుకోవడానికే సర్వే చేస్తున్నామని సోమవారం చంద్రబాబు మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.