ముద్రగడ దీక్షతో హెటెన్షన్: ఎయిర్పోర్టులోనే చినరాజప్పతో బాబు
విజయవాడ: తుని ఘటనల కేసులో అరెస్టులను నిరసిస్తూ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష చేపట్టడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు. వెంటనే తన వద్దకు రావాల్సిందిగా డిప్యూటీ ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్పను ఆదేశించారు.
చినరాజప్పతో చంద్రబాబు గన్నవరం విమానాశ్రయంలోనే చర్చలు జరిపారు. పరిస్థితిని సమీక్షించారు. ముద్రగడ దీక్ష చేయడాన్ని చినరాజప్ప తప్పు పట్టారు. కిర్లంపూడికి చేరుకున్న సిఐడి బృందం ముద్రగడను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే, అందుకు ముద్రగడ నిరాకరిస్తున్నారు.
కిర్లంపూడిలో 144వ సెక్షన్ విధించారు. ఎవరూ దీక్షలు చేయడానికి వీలు లేదని ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు. సిఐడి అధికారులు ముద్రగడతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

ఇదిలావుంటే, కాపు నేత ముద్రగడ దీక్ష ఎందుకు చేస్తున్నారో ఎవరికీ తెలియదని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేరుస్తున్నారని, అనుమానాలు ఉంటే చంద్రబాబును కలిసి సలహాలు ఇవ్వొచ్చన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కాపులు తన వద్దకు రావద్దని బోర్డు పెట్టుకున్న ముద్రగడ ఇప్పుడు కాపుల కోసమంటూ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు .
ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టవద్దని ఆయన సూచించారు. ముద్రగడ వ్యక్తిగత ప్రతిష్ట కోసం కులాన్ని వాడుకోవద్దని, ముద్రగడ దుందుడుకు చర్యలతో కాపులకు నష్టం కలగొచ్చని అభిప్రాయపడ్డారు. సంఘవిద్రోహ శక్తులపై ఉక్కుపాదం తప్పదని బోండా ఉమ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications